
ప్రజలకు చెందిన క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, బీమా క్లెయిమ్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి ఆర్థిక ఆస్తులను సులభంగా గుర్తించి తిరిగి పొందేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సమాచారాన్ని ఒకేచోట అందుబాటులోకి తీసుకువచ్చే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను శుక్రవారం ప్రారంభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమీక్షా సమావేశం సందర్భంగా ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎం. నాగరాజు ఈ పోర్టల్ను ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమాఖ్య (PSB Alliance) సహకారంతో రూపొందించిన ఈ వేదిక ద్వారా ప్రజలు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను సులభంగా శోధించవచ్చు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ పోర్టల్ బ్యాంకు డిపాజిట్లు, బీమా పాలసీలకు సంబంధించిన క్లెయిమ్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లలో మిగిలిపోయిన మొత్తాల కోసం వివిధ సంస్థలు అందిస్తున్న శోధన సౌకర్యాలను ఒకే వేదికపై సమీకరిస్తుంది. దీంతో ప్రజలు వేర్వేరు వెబ్సైట్లను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఒకేచోట నుంచే అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతారు. ఈ కార్యక్రమం మీ డబ్బు – మీ హక్కు పేరుతో ఆర్థిక సేవల శాఖ చేపట్టిన దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించబడింది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, బ్యాంకులు, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి క్లెయిమ్ చేయని ఆస్తుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, వాటిని గుర్తించడం, అసలు యజమానులకు తిరిగి అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ సందర్భంగా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ఒకే వేదికపై పలు శోధన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల పౌరుల సౌలభ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. అలాగే వ్యక్తులు తమ చట్టబద్ధమైన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు ఇది కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్థిక సాధికారత, పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించే ఈ పోర్టల్ విక్సిత్ భారత్–2047 లక్ష్య సాధనకు కూడా దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే, పౌర కేంద్రిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి