AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500 నోటు పవరేంటో తెలుసా? RBI స్టేట్‌మెంట్‌ చూస్తే మీరే షాక్‌ అవుతారు!

రూ.2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత దేశంలో రూ.500 నోట్ల చలామణి గణనీయంగా పెరిగింది. 2025-26లో వీటి సంఖ్య 11.2 శాతం వృద్ధి చెందగా, నకిలీ రూ.500 నోట్ల గుర్తింపు 20 శాతం పెరిగిందని ఆర్‌బీఐ వెల్లడించింది. మొత్తం కరెన్సీ విలువలో రూ.500 నోట్ల వాటా 86 శాతానికి చేరింది.

రూ.500 నోటు పవరేంటో తెలుసా? RBI స్టేట్‌మెంట్‌ చూస్తే మీరే షాక్‌ అవుతారు!
500 Notes
SN Pasha
|

Updated on: May 30, 2026 | 7:14 AM

Share

దేశంలో రూ.2,000 నోట్ల ఉపసంహరణ అనంతరం రూ.500 నోట్ల వినియోగం గణనీయంగా పెరిగినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ ఈ విషయాన్ని పేర్కొంటూ, ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్లదే అత్యధిక వాటా అని తెలిపింది. అదే సమయంలో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరిగినట్లు వెల్లడించింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2026 మార్చి నాటికి దేశంలో 7,05,482 లక్షల రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 6,34,458 లక్షలుగా నమోదైంది. దీంతో ఏడాది కాలంలో రూ.500 నోట్ల చలామణి 11.2 శాతం పెరిగింది. విలువ పరంగా చూస్తే, రూ.500 నోట్ల మొత్తం విలువ రూ.31.72 లక్షల కోట్ల నుంచి రూ.35.27 లక్షల కోట్లకు చేరింది.

దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో సంఖ్యాపరంగా రూ.500 నోట్ల వాటా 41.2 శాతంగా ఉండగా, విలువ పరంగా వాటి వాటా 86 శాతానికి చేరడం విశేషం. సంఖ్యాపరంగా రూ.10 నోట్లు 16.1 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచాయి. మొత్తం కరెన్సీ చలామణి విలువ 11.9 శాతం, సంఖ్య 10.5 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ఇంకా బలంగా కొనసాగుతోందనే సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు నకిలీ నోట్ల సమస్య కూడా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ రూ.500 నోట్లు గుర్తించగా, 2025-26లో ఆ సంఖ్య 1,41,907కు పెరిగింది. అంటే నకిలీ రూ.500 నోట్ల గుర్తింపు 20 శాతం మేర పెరిగినట్లైంది.

అలాగే 30,591 నకిలీ రూ.200 నోట్లను కూడా బ్యాంకింగ్ వ్యవస్థ గుర్తించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. మొత్తంగా నకిలీ కరెన్సీ కేసులు 5.7 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఇక 2023 మేలో ప్రకటించిన రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా 2026 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో 98.45 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది. దీంతో రూ.500 నోటు ప్రస్తుతం భారత కరెన్సీ వ్యవస్థలో కీలక స్థానాన్ని ఆక్రమించినట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us