Union Budget 2026: బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీ గుడ్న్యూస్.. ఈ రూట్లో హైస్పీడ్ రైల్ కారిడార్లు..
బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ రైళ్ల కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా చెన్నై, బెంగళూరుకు వీటిని నిర్మించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లు తిప్పేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.

బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు పలు నగరాలకు అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సలిగుడి మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించునున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. త్వరలో వివిధ ప్రాంతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే భవిష్యత్తులో హైదరాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా రైల్వేశాఖ మధ్య ఉంది. దీంతో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించనున్నారు.
20 కొత్త జలమార్గాలు
అటు డంకుని, సూరత్లను కలుపుతూ కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయాలని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అటు పర్యావరణపరంగా స్థిరమైన కార్గో మూవ్మెంట్ను ప్రోత్సహించడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో 20 కొత్త జాతీయ జలమార్గాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఏఐ టెక్నాలజీపై కీలక ప్రకటన
అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కేంద్రం బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. ఉన్నత స్థాయి విద్య నుండి ఉపాధి వరకు ఏఐ ఆవిష్కరణల కసం స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సీతారామన్ ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతున్న క్రమంలో దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టనుందని ఈ ప్రకటన చూస్తే తెలుస్తుంది.
మెగా టెక్స్టైల్ పార్కులు
ఇక దేశవ్యాప్తంగా మెటా టెక్స్టైల్ పార్క్ల ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రంగంలో స్థాయి, సామర్థ్యం, పోటీతత్వాన్ని పెంపొందించడానికి మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారతదేశం-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో ఈ చర్య మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. భారత వస్త్ర, దుస్తుల ఎగుమతిదారులకు మార్కెట్ ప్రాప్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ చర్యలు కలిసి దేశీయ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి, పోటీ సోర్సింగ్ హబ్గా భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయన్నారు.
కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్
అటు దేశవ్యాప్తంగా 15,000 పాఠశాలల్లో “కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్”ను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటంచారు. పరిశ్రమ కారిడార్ల సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్షిప్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అటు 500 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ వంటి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని సీతారామన్ ప్రతిపాదించారు.
