EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. రూల్స్ మార్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు ఇవే..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ నిబంధనల్లో మార్పులు చేసింది. పీఎఫ్ విత్ డ్రా రూల్స్ను మార్చింది. ఇక నుంచి పాక్షిక ఉపసంహరణ కోసం మూడు కేటగిరీలను ప్రవేశపెట్టింది. ఇక మూడు రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్ చేసేలా ఆటోమేషన్ విధానం తీసుకొచ్చింది.

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది పీఎఫ్ ఖాతాదారులకు ఇది పెద్ద అప్డేట్గా చెప్పవచ్చు. పాత స్కీమ్ స్థానంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో పీఎఫ్ క్లెయిమ్స్, క్లెయిమ్ ప్రక్రియ, నామినేషన్లకు సంబంధించి అనేక నిబంధనలను మార్చింది. ప్రస్తుతం ఉన్న ప్రక్రియలను సులభతరం చేయడం, డిజిటల్, పారదర్శకంగా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.
కనీసం 25 శాతం బ్యాలెన్స్ రూల్
పీఎఫ్ కంట్రిబ్యూషన్ నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 12 శాతం ఈపీఎఫ్కు చెల్లిస్తే.. యజమానులు కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తారు. నెలకు రూ.15 వేల బేసిక్ శాలరీ వరకు ఈపీఎఫ్ చెల్లింపులు తప్పనిసరిగా ఉంటాయి. ఈ మొత్తానికి మించిన చెల్లింపులు స్వచ్ఛందంగా ఉంటాయి. కొత్త పథకంలో పీఎఫ్ ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు చేశారు. ఇప్పుడు మూడు ప్రధాన వర్గాలుగా విభజించింది. ఎమర్జెన్సీ, హౌసింగ్, ప్రత్యేక పరిస్థితులు కారణాలతో పీఎఫ్ డబ్బులను పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక PF ఉపసంహరణకు సంబంధించి 25 శాతం, 75 శాతం నియమం తీసుకొచ్చారు. పీఎఫ్ అకౌంట్ 25 శాతం కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. మిగతా 75 శాతంను ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇక నుంచి మూడు కేటగిరీలు
గతంలో పీఎఫ్ విత్డ్రాయల్స్ కోసం వేర్వేరు సర్వీస్ కాలాలు అవసరమయ్యేవి. ఇప్పుడు చాలా కేటగిరీలకు 12 నెలల సర్వీస్ తప్పనిసరి అవుతుంది. వైద్య అవసరాలకు కూడా 12 నెలల సర్వీస్ అవసరం. పాక్షిక విత్డ్రాయల్స్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈపీఎస్ కింద వేచి ఉండే కాలాన్ని 36 నెలలకు పెంచారు. ఇక కొత్త విధానంలో భౌతిక ఫారం 2 దశలవారీగా తొలగించనున్నారు. ఆన్లైన్ నామినేషన్లు ఇప్పుడు అధికారికంగా గుర్తించనున్నారు. అంతేకాకుండా PF క్లెయిమ్లను 20 రోజుల్లోగా పరిష్కరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. సరైన కారణం లేకుండా క్లెయిమ్ను ప్రాసెస్ చేయడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా 12 శాతం జరిమానా విధించిస్తారు. ఈ మొత్తాన్ని సంబంధిత ప్రాంతీయ PF కమిషనర్ జీతం నుండి వసూలు చేయనున్నారు. క్లెయిమ్స్న వేగంగా ప్రాసెస్ చేసేలా చేయడంలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రూ.5 లక్షల్లోపు క్లెయిమ్స్ మూడు రోజుల్లోనే ఆటోమేటిక్ పద్దతిలోనే క్లియర్ చేసేందుకు కొత్త ఐటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గతంలో క్లెయిమ్స్ కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే పూర్తవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరమైనవారికి ఇది ఉపయోగపడనుంది.
