Shopping: ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో షాపింగ్ చేస్తున్నారా..? డిస్కౌంట్లు ఇక ఉండవ్.. అన్నీ ఆఫర్లు బంద్..
షాపింగ్ చేసేవారికి షాకింగ్ న్యూస్. రానున్న రోజుల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్, కార్డు ప్రమోషన్ ఆఫర్లకు కాలం చెల్లనుంది. అంతర్జాతీయంగా యుద్దాల క్రమంలో ధరలన్నీ పెరిగిపోతున్నాయి. దీని వల్ల అన్ని ధరలు పెరుగుతుండగా.. కంపెనీలపై కూడా భారం పడుతోంది. దీంతో ఆఫర్లను నిలిపివేస్తున్నాయి.

ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా సరే ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు లాంటివి చూస్తూ ఉంటారు. వీటి వల్ల తగ్గింపు ధరల్లో వస్తువును కొనుగోలు చేయవచ్చని అనుకుంటుంటారు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఎక్కువమంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక నుంచి ఇలాంటి ఆఫర్లకు కాలం చెల్లే పరిస్థితులు రానున్నాయి. రాబోయే రోజుల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చు. కంపెనీలు క్రమక్రమంగా డిస్కౌంట్, ఆఫర్లు, క్రార్డు ప్రమోషన్లను తగ్గిస్తూ వస్తున్నాయి. గత కొద్దికాలంగా డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్, కార్డుల ద్వారా వచ్చే తగ్గింపులను ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే..?
డిస్కౌంట్ల కాలం పోయినట్లే..
స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఇలా ఏవి కొనాలన్నా ముందుగా అందరూ చూసేది ఆఫర్ల గురించే. ఎక్కడెక్కడ ఆఫర్లు వస్తాయోనని వెతుకుతూ ఉంటారు. ఎక్కడ తక్కువగా వస్తే అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి ఆఫర్లను భారీగా తగ్గించేశాయి సంస్థలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 5 నుంచి 7 శాతం వరకు డిస్కౌంట్లు పడిపోయాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో చిప్స్ కొరత వల్ల స్మార్ట్ ఫోన్లు,ల్యాప్ టాప్ ధరలు ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. ఇక ఏసీ, ఫ్రిడ్జ్, స్మార్ట్ టీవీ ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. దీంతో అన్ని బ్రాండ్ల కంపెనీలు డిస్కౌంట్లను 7 శాతం వరకు తగ్గించేశాయ.
పెరిగిన ముడి సరుకు ధరలు
ప్రపంచవ్యాప్తంగా రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు పెరిగాయి. ఇక మెమెరీ చిప్స్ ధరలు ఆమాంతం పెరిగాయి. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి భారీగా ఖర్చు అవ్వడంతో కంపెనీలకు ఆదాయం తగ్గుతుంది. అలాగే అంతర్జాతీయంగా గత కొన్నేళ్లుగా దేశాల మధ్య యుద్దాల వల్ల రవాణా చార్జీలు కూడా పెరిగాయి. దీంతో కంపెనీలకు ఆదాయం తగ్గుతుండగా.. డిస్కౌంట్లను కూడా తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ డిస్కౌంట్లు మరింతగా తగ్గే అవకాశముంది. తమకు వచ్చే మార్జిన్లు దెబ్బతింటున్నాయని, అందుకే డిస్కౌంట్లను తగ్గిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో షాపింగ్ ప్రియులకు షాక్ తగులుతోంది. అంతర్జాతీయంగా యుద్దాలు ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముంటుంది. దీని వల్ల డిస్కౌంట్లు, ఆఫర్లు వంటివి ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొచ్చే పరిస్థిత ఉండదు.
