మహారాష్ట్రంలో దారుణం.. రూ.20 కోసం ఓ వ్యక్తి దారుణ హత్య.. ఇడ్లీ విషయంలో గొడవకు దిగిన దుండగులు

కేవ‌లం రూ.20 కోసం ముగ్గురు వ్యక్తులు క‌లిసి ఇడ్లీ వ్యాపారిని కొట్టి చంపారు. మ‌హారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

మహారాష్ట్రంలో దారుణం.. రూ.20 కోసం ఓ వ్యక్తి దారుణ హత్య.. ఇడ్లీ విషయంలో గొడవకు దిగిన దుండగులు
Follow us

|

Updated on: Feb 06, 2021 | 3:37 PM

Man murder for ₹ 20 : ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. రూ.20 కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఇడ్లీ విషయంలో తలెత్తిన చిన్నపాటి గొడ‌వ ఆ వ్యక్తి ప్రాణం తీసింది. కేవ‌లం రూ.20 కోసం ముగ్గురు వ్యక్తులు క‌లిసి ఇడ్లీ వ్యాపారిని కొట్టి చంపారు. మ‌హారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… థానే జిల్లా కేంద్రంలోని మీరా రోడ్డులో వీరేంద్ర అమృత్‌లాల్ యాద‌వ్ (26) అనే వ్యక్తి గ‌త కొంత‌కాలంగా తోపుడు బండిపై ఇడ్లీలు అమ్ముతున్నాడు. శుక్రవారం కూడా ఎప్పటిలాగే ఇడ్లీలు అమ్ముతుండ‌గా ముగ్గురు వ్యక్తులు ఇడ్లీల కోసం వచ్చారు. ముగ్గురు క‌లిసి నాలుగు ప్లేట్ల ఇడ్లీలు తీసుకున్నారు. అయితే, ఇడ్లీల ధ‌ర విష‌యంలో వీరేంద‌ర్ యాద‌వ్‌కు, ఆ ముగ్గురికి మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గింది. త‌న‌కు మ‌రో రూ.20 వస్తాయ‌ని వీరేంద‌ర్ డిమాండ్ చేయ‌గా వాళ్లు ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ గొడ‌వ చిలికి చిలికి గాలివానగా మారిందన్నట్లు.. పెద్దదై ఒక‌రినొకరు తోపులాటకు దారి తీసింది. దీంతో ముగ్గురు వ్యక్తులు ఆవేశానికి లోనై వీరేంద‌ర్‌ను బ‌లంగా వెన‌క్కి తోయ‌డంతో త‌ల‌కు తీవ్ర గాయమైంది. దీంతో వీరేందర్‌కు తీవ్ర రక్తస్రవం అయ్యే అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అనంత‌రం స్థానికులు తీవ్రంగా గాయ‌ప‌డిన వీరేంద‌ర్‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే, అతన్ని పరిశీలించిన వైద్యుులు అత‌ను అప్పటికే మృతిచెందిన‌ట్లు ధృవీక‌రించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందుతులు అక్కడి నుంచి పారిపోయారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘ‌ట‌నకు సంబంధించి కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. పారిపోయిన నిందితుల‌ను సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.

ఇదీ చదవండి…ముఖ్యమంత్రి మార్పుపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప.. వారి మద్దతు ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరని వ్యాఖ్య