రాజధాని తరలింపుపై మరో పిటిషన్
ఏపీ రాజధాని తరలింపు అంశం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలోను హాట్ టాపిక్గానే కొనసాగుతోంది. తాజాగా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
ఏపీ రాజధాని తరలింపు అంశం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలోను హాట్ టాపిక్గానే కొనసాగుతోంది. తాజాగా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ గద్దె తిరుపతి రావు ఈ తాజా పిటిషన్ను ఏపీ ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు.
డిసెంబర్ మూడో వారంలో ఏపీ రాజధాని రగడ దాదాపు నాలుగు నెలలుగా కొనసాగుతూనే వుంది. ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే విపక్షాలన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి మొదలు కావడంతో రాజధాని రగడ పక్కకు వెళుతుందని అందరూ అనుకున్నా.. అమరావతి పరిరక్షణ సమితి వర్గాలు పట్టువదలని విక్రమార్కుల్లా రాజధాని అంశంపై ముందుకు వెళుతున్నారు.
తాజాగా అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ గద్దె తిరుపతిరావు రాజధాని తరలింపుపై హైకోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేశారు. ప్రభుత్వం సెక్రటేరియట్ను గుట్టుచప్పుడు కాకుండా విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. విశాఖకు వెళ్లేందుకు సిద్ధం కావాలని ఉద్యోగులకు సూచనలిస్తోందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలింపును నిలువరించాలని తిరుపతి రావు ఏపీ హైకోర్టును కోరారు.