AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మొహరించారని.. రైతులను రానీయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు.

YS Jagan: రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2025 | 4:26 PM

Share

రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.. 76వేల మామిడి రైతు కుటుంబాల్లో ఎంతమందికి కేజీకి రూ.12 ఇచ్చారు.. కనీసం రూ.3 రూపాయలు కూడా కేజీకి దక్కడం లేదు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం సమయానికి అందించాం.. కూటమి ప్రభుత్వంలో ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి.. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది.. అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. బంగారుపాళ్యం మార్కెట్‌యార్డును సందర్శించిన జగన్.. మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పండించిన పంటను విక్రయించేందుకు రైతులు కష్టాలు పడుతుండటం.. పల్ప్ పరిశ్రమల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తుండటంతో వైసీపీ అధ్యక్షుడు జగన్.. వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకునేందుకు బంగారు పాళ్యం మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు..

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మొహరించారని.. రైతులను రానీయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎస్సీ హుకుం జారీ చేశారు.. ఎందుకు ఈ ఆంక్షలు అంటూ ప్రశ్నించారు. అయినా.. పోలీసుల అడ్డంకులను ఛేదించి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారన్నారు. ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎందుకు లేదని ప్రశ్నించారు. 76వేల మామిడి రైతుల కుటుంబాల్లో ఎంతమందికి కేజీకి రూ.12 ఇచ్చారని.. కనీసం రూ.3 రూపాయలు కూడా కేజీకి దక్కడం లేదన్నారు. ప్రతి రెతు నుంచి కేజీకి మామిడికి రూ.12 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మామిడికి తమ ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అందిందని జగన్ పేర్కొన్నారు. కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం జరగుతుంది.. జిల్లాలో మామిడి కొనుగోలు మే మొదటి వారంలో ఎందుకు మొదలు పెట్టలేదంటూ ప్రశ్నించారు. జూన్‌ రెండో వారం నుంచి మామిడి కొనుగోలు చేయడంతో పంట మార్కెట్‌ ను ముంచెత్తిందని.. కంపెనీలు ధరలు తగ్గించాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయని.. కానీ రైతులకు ధర దక్కలేదన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారని.. ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయలేదన్నారు. మామిడిని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్‌ ముందు ఉంటాడు.. వచ్చేది జగన్‌ ప్రభుత్వమే.. గుర్తుపెట్టుకోవాలంటూ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us