ఏపీలో ఎన్నికల వార్ షురూ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడుపులపాయ చేరుకుంటారు జగన్. వైఎస్ సమాధి దగ్గర ప్రార్థన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఇడుపులపాయ, వేంపల్లి , వీరపునాయనపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు జగన్. ప్రొద్దుటూరులో సాయంత్రం నాలుగుగంటలకు మేమంతా సిద్దం మొదటి సభ జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభల మాదిరిగానే ఈ సభలో కూడా ర్యాంప్ ఏర్పాటు చేశారు.
ప్రొద్దుటూరు సభకు లక్షా 50 వేలమంది వస్తారని అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నేతలు ఈ సభకు భారీగా తరలి రానున్నారు. సభలో సీఎంతో పాటు కడప జిల్లా వైసీపీ అభ్యర్థులు పాల్గొంటారు. సభ ముగిశాక సీంఎ జగన్….ప్రొద్దుటూరు నుంచి బయలుదేరి దువ్వూరు మీదుగా కర్నూలు జిల్లా లోని ఆళ్లగడ్డ చేరుకుంటారని రాత్రికి అక్కడే బస చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న నంద్యాలలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. 29న ఎమ్మిగనూరు సభలో పాల్గొంటారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇవాల్టి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. ఇవాళ పలమనేరు, పుత్తూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి సభల్లో పాల్గొటారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో పాల్గొంటారు. 31న కావలి, మార్కాపురం, రేపల్లె, బాపట్లలో పర్యటిస్తారు.
నువ్వా నేనా అంటున్న జగన్, చంద్రబాబు…ఇద్దరూ కూడా సీమ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తుండడంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..