వెడ్డింగ్ బెల్స్కు వేళాయెరా! శ్రావణ మాసం రాకతో…. కల్యాణ మండపాల్లో కళకళలాడడం మొదలైంది. ఈ నెల 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో 17, 18 తేదీలు పెళ్లిళ్లకు అద్భుత తరుణమని పండితులు చెబుతున్నారు. మూడున్నర నెలల విరామం తర్వాత మళ్లీ వివాహ ముహుర్తాలు రావడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. గత ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి, దానికి తోడు గురు మూఢమి కూడా రావడంతో వివాహాలకు బ్రేకులు పడ్డాయి. మూడున్నర నెలల గ్యాప్ తర్వాత ముహూర్తాల ఉండడం, ఇక శ్రావణమాసం కూడా రావడంతో, పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహుర్తాలు లేకపోవడంతో మూడు నెలల పాటు ఇబ్బందులు పడ్డామంటున్నారు పురోహితులు. కాగా ఆగస్టు నెల 31 లోపే శుభకార్యాలను ముగించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.
శుభ కార్యాల సీజన్ రావడంతో, కల్యాణ మండపాలు కూడా బుక్ అయిపోతున్నాయి. విద్యుత్ అలంకరణ, బాజాభజంత్రీలు, బ్యూటీషియన్లు, టెంట్ హౌస్ నిర్వాహకులు, ప్రింటింగ్ప్రెస్, బట్టలు, కిరాణం, కేటరింగ్…ఇలా చాలామందికి చేతి నిండా పని దొరుకుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వందలాది కల్యాణ మండపాలు ఉన్నాయి. పెళ్లి నిర్వహణకు ఏరియాను, మండపాన్ని బట్టి 30 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు.
ఏ వివాహ వేడుకకైనా మేకప్ వెయ్యాల్సిందే. బ్యూటీషియన్ రావాల్సిందే. ఒక పెళ్లికి మేకప్ వేసినందుకు 10 వేలనుంచి 50 వేల రూపాయల వరకు చార్జ్ చేస్తారు. అయితే సీజన్ని బట్టి ఒక్కోసారి ప్యాకేజ్ కింద మాట్లాడుకుంటామంటున్నారు రాజమండ్రి ఇన్ఫినిటీ బ్యూటీ పార్లర్ యజమాని. అయితే ఆషాఢ మాసంలో ఎలాంటి శుభ కార్యాలు జరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామంటున్నారు బ్యూటీషియన్లు. పెళ్లిళ్ల సీజన్ బిగిన్ అవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఇక ఈ నెలలోనే.. 9వ లేదీన నాగుల పంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి వంటి ఫెష్టివల్స్ ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.