బ్రెయిలీ కష్టాలకు చెక్.. వాయిస్ కమాండ్తో అక్షరాలు ప్రింట్ చేసే సరికొత్త డివైజ్
ఓ చిన్ని ఆలోచన అంధ విద్యార్థుల భవితకు సరికొత్త వెలుగు చూపింది. ఆ లోచనను ఆచరణలోకి తీసుకొచ్చి భీమవరం విద్యార్థిని సృష్టించిన అద్భుత ఆవిష్కరణ రుద్ర వాయిస్ ప్రింటర్.. దీని ప్రత్యేకత ఏమింటంటే.. మనం మాట్లాడే మాటలనే బ్రెయిలీ అక్షరాలుగా మార్చి ఇస్తుంది. ఈమె తయారు చేసిన ఈ ప్రింటర్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపురావడంతో పాటు అంద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. మరీ ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం పదండి.

సృష్టిలోని అందాలను వీక్షించలేని నిస్సహాయత ఒకవైపు.. అక్షర జ్ఞానాన్ని సముపార్జించుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు మరోవైపు. చూపులేని లోటును అధిగమించి చదువుకోవాలనే తపన ఉన్న అంధులకు బ్రెయిలీ లిపే ఏకైక ఆలంబన. అయితే, ఆ లిపిని రాయడం, చదవడం ఎంత కష్టతరమో, ఎంత సమయంతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంధ విద్యార్థుల ఈ నిత్య శ్రమను, వారి వేలికొనలు కోల్పోతున్న స్పర్శ వేదనను గమనించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నోటి మాటతోనే క్షణాల్లో బ్రెయిలీ అక్షరాలను ముద్రించే రుద్ర అనే సరికొత్త వాయిస్ ఓవర్ టెలి-ప్రింటింగ్ మిషన్ను రూపొందించారు. ఇది చూపులేని విద్యార్థుల విద్యాభ్యాసానికి నయా దారులను వేస్తుందని వాళ్లు అంటున్నారు.
బ్రెయిలీ రాత కష్టాలు.. ఆలోచింపజేసిన క్షేత్రస్థాయి పరిశీలన
సాధారణంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులు బ్రెయిలీ లిపిని రాయడానికి కాగితంపై పిన్ (స్టైలస్) సహాయంతో డాట్లను ఎంబోస్ చేస్తూ రాస్తుంటారు. ఆ తర్వాత పేపర్ను తిరగేసి, చేతివేళ్లతో ఆ డాట్లను స్పర్శిస్తూ చదువుతారు. ఏళ్ల తరబడి నిరంతరం పిన్తో నొక్కుతూ రాయడం వల్ల కాలక్రమేణా విద్యార్థుల వేళ్ల చివరల్లో స్పర్శ జ్ఞానం తగ్గిపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా చదవడం, రాయడం వారికి మరింత భారంగా మారుతోంది.
అయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇంజనీరింగ్ చదువుతున్న లింగంపల్లి హిమజ స్థానిక ‘డాక్టర్ యు.వి. రమణరాజు బ్లైండ్ స్కూల్’ను సందర్శించినప్పుడు ఈ సమస్య తీవ్రతను స్వయంగా చూశారు. అంధుల శ్రమను తగ్గించేందుకు సాంకేతిక పరిష్కారం తీసుకురావాలన్న ఆమె సంకల్పమే ప్రాజెక్ట్ రుద్రకు పునాది వేసింది. ఆరంభంలో బ్రెయిలీ అక్షరాలను ప్రింట్ చేసే యంత్రాన్ని రూపొందించే దిశగా హిమజ తన ప్రొఫెసర్లు, లెక్చరర్ల మార్గదర్శకత్వంలో పరిశోధనలు ప్రారంభించారు. యూనివర్సిటీ సహకారంతో ముందుగా ‘పుష్ బటన్’ ఆధారిత తొలి వెర్షన్ ప్రింటింగ్ సిస్టమ్ను తయారుచేశారు.
దీని ద్వారా బటన్లను ప్రెస్ చేయగానే అక్షరాలు బ్రెయిలీ రూపంలో ప్రింట్ అయ్యేవి. అయితే, ఈ పరికరాన్ని పాఠశాలలోని అంధ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చూపించినప్పుడు వారి నుంచి వచ్చిన ప్రశ్న ప్రాజెక్ట్ను మరో మలుపు తిప్పింది. మేము స్పష్టంగా మాట్లాడగలిగినప్పుడు మళ్లీ బటన్లు వెతుక్కుంటూ నొక్కడం ఎందుకు? నేరుగా మా మాటలనే విని ప్రింట్ చేసే వ్యవస్థ ఉంటే ఇంకా సులభం అవుతుంది కదా! అని విద్యార్థులు అమూల్యమైన సలహా ఇచ్చారు. విద్యార్థుల అవసరాన్ని అర్థం చేసుకున్న హిమజ, ప్రాజెక్ట్ను పూర్తిగా రీ-డిజైన్ చేసి అధునాతన వాయిస్ ప్రింటర్గా మలిచారు.
అత్యాధునిక సాంకేతికతతో ‘రుద్ర’ వాయిస్ ప్రింటింగ్ యంత్రం
మాటలను ఇన్పుట్గా స్వీకరించి, క్షణాల వ్యవధిలో బ్రెయిలీ లాంగ్వేజ్ను అవుట్పుట్గా అందించే సరికొత్త పరికరమే ‘రుద్ర’. అలెక్సా వాయిస్ ఆర్కిటెక్చర్, శక్తిమంతమైన మైక్రో ప్రాసెసర్ సహాయంతో ఈ మిషన్ను రూపొందించారు. ఆన్లైన్ ద్వారా అవసరమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లను సమకూర్చుకుని, సుమారు రూ. 1,50,000 వ్యయంతో, మూడు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి హిమజ ఈ సంపూర్ణ వాయిస్ ప్రింటర్ను సిద్ధం చేశారు.
చూపులేని విద్యార్థులు తాము చెప్పదలచుకున్న సమాధానాలు లేదా ఆలోచనలను స్వయంగా మాట్లాడితే చాలు, ఈ ప్రింటర్ తక్షణమే వాటిని స్పష్టమైన బ్రెయిలీ డాట్స్ రూపంలో ప్రింట్ చేస్తుంది. ఇది విద్యార్థుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా పరీక్షలు రాయడంలోనూ, తమ భావవ్యక్తీకరణలోనూ సహాయకారిగా నిలుస్తుంది.
జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం..
హిమజ ఆవిష్కరించిన ‘రుద్ర’ వాయిస్ ప్రింటర్కు జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్కడితో ఆగకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అంతర్జాతీయ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 165 వినూత్న ప్రాజెక్టులతో పోటీపడి, టాప్-20లో 20వ స్థానాన్ని దక్కించుకుని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. తన ఆవిష్కరణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడంపై ఇంజనీరింగ్ విద్యార్థిని హిమజ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అయితే సమాజంలో వెలుగులు చూడలేని అంధ విద్యార్థుల జీవితాల్లో ఈ ‘రుద్ర’ విజ్ఞాన వెలుగులు నింపినప్పుడే నా ప్రయత్నానికి నిజమైన సార్థకత చేకూరుతుంది అని చెబుతున్నారు .
విద్యార్థులు చదువుకోవడానికి, వార్షిక పరీక్షలను స్వతంత్రంగా రాసుకోవడానికి, ఉన్నత విద్యలో దూసుకుపోవడానికి రుద్ర ఒక బలమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించడమే కాకుండా, సాంకేతికతను జోడించి సమాజహితమైన ఆవిష్కరణగా తీర్చిదిద్దిన భీమవరం విద్యార్థిని హిమజ ప్రతిభ నేటి యువ ఇంజనీర్లకు గొప్ప స్ఫూర్తిదాయకం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
