
విశాఖపట్నం, నవంబర్ 13: విశాఖలోని ఓ ప్రభుత్వ మద్యం షాపు సిబ్బందికి వింత అనుభవం ఎదురైంది. మద్యం కొనేందుకు వచ్చిన ఓ మందుబాబు వింతగా ప్రవర్తించాడు. తనకు మద్యం ఇవ్వాలని ఓ బ్రాండ్ పేరు చెప్పాడు. బ్రాండ్ మాట అటు ఉంచితే.. షాపు మూసి వేసే సమయం కావడంతో నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు సిబ్బంది. ఆయినప్పటికీ మొండిగా పట్టుపట్టాడు ఆ మందుబాబు. నిరాకరించేసరికి కక్షకట్టాడు.. వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. చివరకు చెప్పిందే చేశాడు. దీంతో షాపులో ఉన్న సరుకంతా దీపావళి పూట అగ్నికి ఆహుతైంది. అందరూ బాణాసంచా కాల్చేందుకు సిద్ధమవుతుంటే.. విశాఖ పోతిన మల్లయ్య పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మాత్రం పరుగులు పెట్టారు. ప్రభుత్వ మద్యం షాప్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. సిబ్బంది పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎలాగోలా ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు.
పోతినమల్లయ్య పాలెం సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఏరియా కొమ్మాది లోని ప్రభుత్వ వైన్షాప్ వద్దకు గుమ్మడి మధు అనే వ్యక్తి వెళ్లాడు. మద్యం ఇవ్వాలని అక్కడి సిబ్బందిని అడిగాడు. అయితే షాప్ క్లోజ్ చేసే సమయం కావడంతో.. అకౌంట్స్ చూసుకుంటున్నారు సిబ్బంది. ఆ సమయంలో వచ్చి మద్యం కోసం పట్టుబడ్డాడు మధు. తాము ఇప్పుడు మద్యం అమ్మే పరిస్థితుల్లో లేమని.. సమయం కూడా మించిపోయిందని.. ఎకౌంట్స్ క్లోజ్ చేసేస్తున్నామని చెప్పి పంపేశారు సిబ్బంది.
దీంతో షాప్ సిబ్బందితో గొడవ పడ్డాడు మధు. సదరు వ్యక్తికి, సిబ్బందికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇదంతా శనివారం రాత్రి జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గుమ్మడి మధు.. వెళ్తూ వెళ్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ‘నాకు మందు అడిగితే ఇవ్వరా..? మిమ్మల్ని మీ షాపుని తగలబెట్టేస్తాను..’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మందు బాబు కదా పెద్దగా ఆ మాటలు పట్టించుకోలేదు సిబ్బంది.
మరుసటి రోజు ఉదయాన్నే మద్యం షాపును తెరిచారు. మధ్యాహ్నం గడిచింది.. సాయంత్రం అయింది. సమయం దాదాపుగా సాయంత్రం నాలుగున్నర. మరికాసేపట్లో దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈలోగా ఒక్కసారిగా ఆ మద్యం షాప్ నుంచి మంటలు చెలరేగాయి. లోపల ఉన్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అదేదో ప్రమాదం కాదు.. ముందు రోజు మద్యం ఇవ్వనందుకు గుమ్మడి మధు వచ్చి నిప్పంటీంచాడు. పెట్రోల్ తీసుకొచ్చి షాపుపై వేసి తగలబెట్టేసాడు. షాపులో ఉన్న సిబ్బంది చూసి పరుగులు పెట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే కొంతవరకు షాపులో ఉన్న సరుకు, కంప్యూటర్లు కాలిపోయింది. కంప్యూటర్, ప్రింటర్ సహా లక్షన్నార పైగా ఆస్తి కాలిపోయింది. దీంతో.. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గుమ్మడి మధును అరెస్టు చేశారు.
ఇదండీ.. మద్యం కోసం వచ్చిన ఓ మందుబాబు చేసిన ఘనకార్యం. షాపులో ఉన్న సరుకుకు మంటలు అంటుకున్నాయి కాబట్టి సరిపోయింది.. ఏకంగా సిబ్బంది పైన పెట్రోల్ పోసి తగలబెడితే పరిస్థితి ఊహించడానికే భయమేస్తుంది అంటున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.