ఉద్యమంలా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం…మరో 21 అంబులెన్సులు
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది.
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. తాజాగా మరో 21 అంబులెన్స్లు ప్రజా సేవ కోసం అందుబాటులోకి వచ్చాయి. శనివారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రగతి భవన్లో జరిగింది.
అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అందించిన అంబులెన్సులను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ నియోజకవర్గాలకు సేవలందించేందుకు శనివారం ప్రారంభించిన 21 అంబులెన్స్లను పంపించడం జరిగింది.
మహబూబ్ నగర్, హైదరాబాద్ కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులను వినియోగించనున్నారు. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఉపేందర్ రెడ్డి, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, వరంగల్కు చెందిన లక్ష్మణరావు, మహబూబ్ నగర్ కు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డి లు అంబులెన్సులను అందించారు.