AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అక్టోబర్‌లో DSC 2026 నోటిఫికేషన్.. డిసెంబర్‌లో పరీక్షలు’ విద్యాశాఖ క్లారిటీ

డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ విద్యాశాఖ తీపి కబురు తెలిపింది. వచ్చే అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా రానున్న డీఎస్సీపై దృష్టి సారించి ప్రిపరేషన్ ప్రారంభించాలని అధికారులు సూచించారు..

'అక్టోబర్‌లో DSC 2026 నోటిఫికేషన్.. డిసెంబర్‌లో పరీక్షలు' విద్యాశాఖ క్లారిటీ
AP DSC Notification
Srilakshmi C
|

Updated on: Aug 07, 2026 | 8:51 PM

Share

అమరావతి, ఆగస్ట్‌ 7: మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరోసారి స్పష్టత ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు వివరణ ఇచ్చినా కొందరు దుష్ప్రచారం కొనసాగిస్తున్నందున మరోసారి వివరాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. డీఎస్సీలో హారిజాంటల్ రిజర్వేషన్ నిబంధనలను పూర్తిగా అమలు చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులకే పోస్టులు కేటాయించామని, నియామకాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యాశాఖను నేరుగా సంప్రదిస్తే పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు.

12 దశల్లో పారదర్శకంగా డీఎస్సీ నిర్వహణ

డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం మొత్తం 12 దశల విధానాన్ని అనుసరించిందని తమీమ్ అన్సారియా వెల్లడించారు. ప్రశ్నపత్రాల తయారీలో అనుభవజ్ఞులైన ఉత్తమ ఉపాధ్యాయులను నియమించామని చెప్పారు. అలాగే మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ వంటి వివరాలను ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో పరిశీలించుకునే అవకాశం ఉందని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగాలు రాని అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, రానున్న డీఎస్సీ నియామకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్‌లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్

డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో కీలక ప్రకటన కూడా చేశారు. వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్‌ను అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలని సూచించారు. డీఎస్సీ నియామకాలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని విద్యాశాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. పారదర్శకంగా నిర్వహించిన నియామక ప్రక్రియపై అనవసర అపోహలు సృష్టించే ప్రయత్నాలను నమ్మవద్దని స్పష్టం చేసింది.

Follow Us