Tirumala: సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 15 వరకు ఈ బ్రేక్ దర్శనాల రద్దు అమలులో ఉంటుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

తిరుమల కొండపై వేసవి రద్దీ అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీతో కొండ కిటకిటలాడుతోంది. తిరుమల వెంకన్న దర్శనానికి క్యూ లైన్ పెరిగిపోతోంది. రోజూ ఆలయం బయటకు వస్తున్న భక్తుల క్యూ లైన్ తిరుమలలో సాధారణంగా మారింది. దీంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించింది. సర్వదర్శనం సమయాన్ని పెంచడంతోపాటు సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం కల్పించాలన్న ఆలోచనతో సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలానే, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చింది. ఈ నిర్ణయాలను మే 1 నుంచి జూలై 15 వరకు అంటే దాదాపు రెండున్నర నెలల పాటు పరిశీలనాత్మకంగా అమలు చేస్తోంది. వేసవి రద్దీతో అన్యూహంగా పెరిగిన భక్తుల రద్దీతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
వీఐపీలను కట్టడి చేసి.. ఎక్కువ సమయం సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్ దర్శన సమయం విషయంలో కీలక మార్పులు చేసింది. అయితే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రం వెసులుబాటు కల్పించింది. స్వయంగా వచ్చే వీఐపీలను మాత్రమే ప్రోటోకాల్ వీఐపీలుగా పరిగణించి.. అలాంటి వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఇస్తుంది. అలానే వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లోనూ మార్పులు తీసుకువచ్చింది. బ్రేక్ దర్శన సమయాన్ని కుదించడం ద్వారా సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.
వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలోనూ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ప్రొటోకాల్ దర్శనాలు.. 6 గంటల 30 నిమిషాలకు రెఫరల్ దర్శనాలు.. 6 గంటల 45 నిమిషాలకు జనరల్ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు శ్రీవాణి దాతలు, 10 గంటల 30 నిమిషాలకి డోనర్స్.. 11 గంటలకు టీటీడీ ఉద్యోగుల బ్రేక్ దర్శనాలు ఉంటాయి. అయితే గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేక సేవ కారణంగా.. ఆ రెండు రోజులు మాత్రం బ్రేక్ దర్శనాలు పాత సమయం ప్రకారమే కొనసాగుతాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..