Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ప్రభుత్వం బిగ్ డెసిషన్..
రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ ఊరట కలిగించింది. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునే ప్రాసెస్ను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. అలాగే వాట్సప్స్ గవర్నెన్స్ ద్వారా ఈ సేవలను మెరుగుపర్చాలని సూచించారు.

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త. ఇక నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, విభజన మరింత సులువు కానుంది. ఈ మేరకు సులభంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకునేలా సేవలను మెరుగుపర్చాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలోని ఆర్బీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ సేవలపై నారా లోకేష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ సేవలను సులభతరం చేయాలని సూచించారు. రేషన్ కార్డుల్లో పేర్లను చేర్చడం, తొలగించడం, కార్డులను విభజించడం వంటి సేవలు ప్రజలు సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరతగతిన ఈ సేవలను మెరుగుపర్చాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ సర్టిఫికేట్ల జారీలో..
ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి పత్రాల జారీలో ఉన్న అడ్డంకులను తొలగించి వేగంగా ప్రజలు పొందేలా చేయాలని లోకేష్ సూచించారు. వీటిల్లో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ పనులు జులై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రజలకు చేరువచేయాలని సూచించారు. నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇక విద్యార్థులకు విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్లు అభ్యర్థి ఆధార్ నెంబర్ ద్వారా డీజీ వెరిఫై ఆధారంగా పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఇక వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న రేషన్ సేవలను మరింత సులభతరం చేయాలని పేర్కొన్నారు.
వాట్సప్ ద్వారా సేవలు
ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పని లేదు. మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి సులువుగా చేసుకోవచ్చు. ఇక వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి వద్దనే సులువుగా మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా వాట్సప్ నుంచే ప్రజలు ప్రభుత్వ సర్టిఫికేట్లు, సేవలు పొందవచ్చు. అన్ని శాఖలను వాట్సప్ గవర్నెన్స్తో అనుసంధానం చేశారు. దీంతో వాట్సప్ నుంచే ఏ సేవ అయినా పొందవచ్చు. దీని వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి.
