Vikram Travels: విక్రమ్ ట్రావెల్స్ నిర్వాకం.. గంటల తరబడి హైవేపై బస్సులోని ప్రయాణీకులు..
ముంబయి నుంచి జగ్గయ్యపేటకు వస్తున్న విక్రమ్ ట్రావెల్స్ బస్సు పూణే–వాకాడ్ వద్ద అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు రాత్రి వేళ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక లోపం కారణంగా బస్సు హైవేపై గంటల తరబడి నిలిచిపోయినా, కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.

ముంబయి నుంచి ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటకు బయలుదేరిన విక్రమ్ ట్రావెల్స్ బస్సు (NL02 B 8788) పూణే–వాకాడ్ సమీపంలో అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులో సాంకేతిక లోపం రావడంతో డ్రైవర్ వాహనాన్ని హైవే పక్కకు తీసి ఆపేశాడు. మెకానిక్ వస్తున్నాడు అని చెప్పి ప్రయాణీకులను గంటల తరబడి రోడ్డు వెంబడే వెయిట్ చేయిస్తున్నారు. సంస్థ ఆఫీసుకు ఫోన్ చేసినా పరిస్థితి అదే. మెకానిక్ ఎప్పుడు వస్తాడో తెలీదు… వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే అంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ప్రయాణీకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకుంది.
రాత్రి వేళ ఎముకలు కొరిచే చలిలో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు బస్సులోనే ఇరుక్కుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు దిగే పరిస్థితి లేదు… లోపల హీటర్ లేదు. ప్రయాణీకులు ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. కొందరు ఆహారం కూడా తినలేదని.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రిప్లేస్మెంట్ బస్సు పంపాలని కోరుతున్నారు. ప్రయాణీకుల భద్రతపై కంపెనీ బాధ్యత తీసుకోవాలని.. ఇలాంటి నిర్లక్ష్యంపై అధికారుల కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విక్రమ్ ట్రావెల్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణీకులు మధ్యరాత్రి రోడ్డు మధ్యలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బస్సులను నిర్వహిస్తున్న సంస్థల యాజామాన్యాలు నిర్వాకాలు చూస్తున్నాం. ఆ లిస్ట్లో తాజాగా విక్రమ్ ట్రావెల్స్ కూడా చేరింది.




