Andhra Pradesh: అనార్యోగంతో ఎద్దు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపించిన గ్రామస్తులు.. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు.. ఎక్కడంటే

| Edited By: Ram Naramaneni

Feb 08, 2024 | 10:03 PM

తమ గ్రామంలో బసవన్న సంచరిస్తుంది కాబట్టే గ్రామమంతా సుభిక్షంగా ఉందని బసవన్న పై అమితమైన విశ్వాసం పెంచుకున్నారు. ఆ నమ్మకంతోనే ప్రతిరోజు బసవన్నకు పూజలు చేయడం, మంచి మంచి ఆహారం పెట్టడం చేస్తుండేవారు గ్రామస్తులు. బసవన్నకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే గ్రామస్తులు స్పందించి వెటర్నరీ డాక్టర్ కి చూపించి జాగ్రత్తలు తీసుకునేవారు. అలా ఏళ్ల తరబడి తమతోనే తమ గ్రామంలోనే సంచరిస్తుండటంతో గ్రామస్తులు కూడా బసవన్నతో అనుభందం పెంచుకున్నారు.

Andhra Pradesh: అనార్యోగంతో ఎద్దు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపించిన గ్రామస్తులు.. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు.. ఎక్కడంటే
Last Rites For Ox
Follow us on

విజయనగరం జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన ఎద్దుకి గ్రామంలో డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, భజనలతో గ్రామమంతా ఊరేగించి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలో చనిపోయిన బసవన్న ఎద్దు కాదని తాము ఎంతగానో నమ్మే తమ ఆరాధ్య దైవం సింహాచలం అప్పన్న ప్రతి రూపమని అలాంటి బసవన్న తమకు దూరం కావటం తట్టుకోలేక పోతున్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్ కోట మండలం మామిడిపల్లిలో జరిగిన ఈ ఘటన చుట్టుప్రక్కల గ్రామాల వారిని సైతం కలిచివేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మామిడిపల్లి గ్రామంలో ఒంటరి బసవన్న సంచరిస్తూ ఎవరిని ఏమీ అనకుండా, ఎవరు ఏది పెడితే అదే తింటూ అందరి మన్ననల్ని పొందింది. అందరికీ తల్లో నాలుకలా ఉంటూ జీవనం సాగించింది. ఈ క్రమంలోనే ఇక్కడి గ్రామస్తులు కూడా సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండటంతో తమ గ్రామంలో బసవన్న సంచరిస్తుంది కాబట్టే గ్రామమంతా సుభిక్షంగా ఉందని బసవన్న పై అమితమైన విశ్వాసం పెంచుకున్నారు. ఆ నమ్మకంతోనే ప్రతిరోజు బసవన్నకు పూజలు చేయడం, మంచి మంచి ఆహారం పెట్టడం చేస్తుండేవారు గ్రామస్తులు. బసవన్నకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే గ్రామస్తులు స్పందించి వెటర్నరీ డాక్టర్ కి చూపించి జాగ్రత్తలు తీసుకునేవారు. అలా ఏళ్ల తరబడి తమతోనే తమ గ్రామంలోనే సంచరిస్తుండటంతో గ్రామస్తులు కూడా బసవన్నతో అనుభందం పెంచుకున్నారు.

బసవన్నను సింహాచలం అప్పన్న స్వామిగా భావించడం వల్ల గ్రామస్తులెవరు బసవన్నను కొట్టడం గానీ, తిట్టడం గాని చేసేవారు కాదు. నిత్యం బసవన్న బాగోగులు చూస్తూ ఉండేవారు. బసవన్న సంతోషంగా ఉంటే తమ గ్రామం కూడా సంతోషంగా ఉంటుందనే విశ్వాసాన్ని మరింతగా పెంచుకున్నారు. ఈ క్రమంలోనే బసవన్న అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ గ్రామ దేవదేవుడు తమకు దూరమయ్యాడని రోధించారు. వెంటనే గ్రామస్తులు అంతా కలిసి పెద్ద ఎత్తున లాంఛనంగా అంత్యక్రియలు జరిపేందుకు నిర్ణయించుకున్నారు. మేళతాళాలతో, భజనలతో, డప్పు వాయిద్యాల నడుమ వందలాది మంది గ్రామస్తుల తోడ్పాటుతో బసవన్న అంతిమయాత్ర ఊరేగింపుగా జరిపారు.

గతంలో ఏ వ్యక్తి చనిపోయినా జరగని విధంగా బసవన్నకి అంత్యక్రియలు జరిగాయి. అంతేకాకుండా అంత్యక్రియలు తర్వాత కర్మకాండ కూడా నిర్వహించి గ్రామమంతా కలిసి భోజనాలు చేశారు. ఇన్నాళ్లు తమ గ్రామాన్ని సుభిక్షంగా చూసిన బసవన్న భవిష్యత్తులో కూడా తమను చల్లగా చూడాలని వేడుకున్నారు. బసవన్న అంత్యక్రియలు చూసిన చుట్టుపక్కల గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏది ఏమైనా బసవన్న పట్ల గ్రామస్తులు పెంచుకున్న విశ్వాసం అందరినీ ఆలోచింపజేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..