Tirumala: వారికి గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు
ఈ ఆర్ధిక సంవత్సరానికి 5 వేల 58 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది..టీటీడీ పాలకమండలి. ఇటీవల తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు సూచించిన పలు కీలక నిర్ణయాలకు కూడా ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

ముఖ్యమంత్రి ఆదేశాలతో.. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు కేటాయింపులు రద్దు చేసింది టీటీడీ బోర్డు. టీటీడీ ఆస్తులు పరిరక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు..భూములపై న్యాయపరమైన వివాదాలపై పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేశారు. భూములు కేటాయించినా కూడా పనులు ప్రారంభించకపోవడంతో సైన్స్సిటీకి కేటాయించిన ల్యాండ్స్ను తిరిగి వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ నిర్ణయాలు వివరంగా దిగువన తెలుసుకుందాం…
– గత ప్రభుత్వ హయాంలో ముంతాజ్ హోటల్స్కు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు సిఎం గారు ప్రకటించారు.
• భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోని శ్రీవారి ఏడు కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేపట్టకుండా నిర్ధిష్టమైన కార్యాచరణ అమలు.
• ఇప్పటికే ఏడు కొండల ఆనుకుని వున్న భూముల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములను టిటిడి స్వాధీనం చేసుకుని, వాటికి ప్రత్యామ్నాయంగా చూపడానికి, ఈ అంశంపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వానికి నివేదన.
• ముందుముందు శ్రీవారి ఏడు కొండలకు ఆనుకుని వున్న భూములలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరిగేలా ధార్మిక చట్టాల్లో సవరణలు.
• శ్రీవారికి దేశ వ్యాప్తంగా ఉన్న ఆస్తులను పరిరక్షించడం, వాటిని సద్వినియోగపరచడం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు.
• న్యాయస్థానాల్లో వివాదాల్లో ఉన్న స్వామివారి ఆస్తుల వివాదాలను వేగంగా విచారణ ప్రక్రియ పూర్తి అయ్యి సద్వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరుగుతుంది.
• శ్రీవారి పవిత్ర భూమిలో ఒక్క అంగుళం కూడా అనధికార ఆక్రమణలు ఉండకుండా చర్యలు తీసుకుంటాం.
• టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు అందరూ హిందూ ధర్మానుసారం మాత్రమే ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇతర మతస్థులను వారి హోదాకు తగినట్లుగా, వారి మనోభావాలకు భంగం కలగకుండా వివిధ ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా వారిని బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది.
• దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టిటిడి ఆలయాలు నిర్మించేందుకు ధృడ సంకల్పంతో కార్యాచరణ అమలు . ఇందుకోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయా రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కోరుతూ లేఖలు
• భూమి కేటాయింపులు అనుసరించి వేగంగా అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాల నిర్మాణాలు మొదలు
• రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళిత వాడల్లో ఆర్ధిక స్థోమత లేక నిర్మాణంలో ఆగిపోయిన దేవాలయాలను, శిధిలావస్థకు చేరిన దేవాలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించాము.
• కొత్త దేవాలయాల నిర్మాణ ప్రతిపాదనలకు కూడా ఆర్థిక సహకారం అందిస్తాం. ఈ కార్యక్రమాల కోసం శ్రీవాణి ట్రస్టు నుంచి ఆర్థిక సాయం అందించి, రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణ, నిర్మాణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయిస్తాము.
• ఈ ప్రక్రియకు టిటిడి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. నిరంతరాయంగా, ఎక్కడా రాజీపడకుండా దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది.
• ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో శ్రీవారి కళ్యాణాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు
వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్లో దర్శన టికెట్లు కేటాయింపు కోసం ప్రయోగాత్మకంగా గత విధానాన్ని అమలు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పించడంతో పాటు వీఐపీ దర్శన వేళలను మారుస్తామని చెప్పారు..టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.