Andhra News: కృష్ణమ్మ అలలపై అద్భుత దృశ్యం.. వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాధారణంగా రాజకీయ ర్యాలీలు రోడ్లపై జరుగుతాయి. కానీ ఏపీలో మాత్రం రాజకీయ ర్యాలీకి కృష్ణానది వేదికగా మారింది. అలల మధ్య సాగిన బోట్లపై పసుపు జెండాలు రెపరెపలాడుతుంటే. నదంతా ఒక రాజకీయ ఉత్సవంగా మారిపోయింది. తాడేపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇంత వినూత్నంగా, వైభవంగా జరగడం ప్రాంతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కృష్ణా నదిలో కన్నుల పండుగగా జరిగాయి. బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుంచి ప్రారంభమైన ఈ బోటు ర్యాలీ కృష్ణా నదిలో ఒక అరుదైన దృశ్యాన్ని సృష్టించింది. మొత్తం 10 భారీ ఇసుక బొట్లు, 20 మర బోట్లతో ప్రాకశం బ్యారేజ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ సమయంలో బోట్లపై ఎగిరే టీడీపీ జెండాల దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
బోట్లపై ఉన్న నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు కలిసి ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. జై తెలుగుదేశం అంటూ గట్టిగా వినిపించిన స్వరాలు కృష్ణా అలలపై ప్రతిధ్వనించాయి. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ఈ ర్యాలీ నదిపై ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించింది. ఉండవల్లి కరకట్టపై ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు తారసపడ్డారు.
వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడిపిస్తూ ర్యాలీని వీక్షించగా, పాదచారులు చేతులు ఊపుతూ మద్దతు తెలిపారు. కొందరు మొబైల్ ఫోన్లలో ఈ అరుదైన క్షణాలను బంధించారు. దీంతో కరకట్ట ప్రాంతం మొత్తం ఒక ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.. బోటింగ్ సొసైటీ సభ్యులు, స్థానిక మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వీడియో చూడండి..
నదిపై ఇలా రాజకీయ ర్యాలీ నిర్వహించడం అరుదైన విషయం. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి కొత్త శోభ తీసుకొచ్చారు. కృష్ణా అలలపై సాగిన ఈ బోటు ర్యాలీ, తాడేపల్లి ప్రాంతంలో చిరస్మరణీయ ఘటనగా నిలిచిపోనుంది.
మరిన్ని అంధ్రప్రవేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
