Andhra: వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
వేదికపై వినిపించిన ఓ గిరిజన యువకుడి విన్నపం నిమిషాల్లోనే కార్యరూపం దాల్చింది. కానిస్టేబుల్ నియామక సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో తెనుములబండ గ్రామానికి రూ.2 కోట్ల బీటీ రోడ్డు మంజూరు అయ్యింది. మాటకు పనిని జోడించిన ఈ క్షణం సభను ఆశ్చర్యంలో ముంచింది.

కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రికి.. సీఎం అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి.. పవన్ కళ్యాణ్కు పంపింది. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




