AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCTV camera footage: ఆ కుటుంబం పాలిట శాపంగా మారిన సీసీ కెమెరా ఫుటేజ్‌.. వెంటాడుతున్న కష్టాలు

ఓ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలే ఆ కుటుంబం పాలిట శాపంగా మారాయి. ఎందుకు సీసీ కెమెరాలు పెట్టామా అనేటట్టుగా వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. సీసీ కెమెరా ఫుటేజ్ తో పోలీసులకు సహాయం చేసినా,..

CCTV camera footage: ఆ కుటుంబం పాలిట శాపంగా మారిన సీసీ కెమెరా ఫుటేజ్‌.. వెంటాడుతున్న కష్టాలు
Elr
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2022 | 9:10 PM

Share

ఓ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలే ఆ కుటుంబం పాలిట శాపంగా మారాయి. ఎందుకు సీసీ కెమెరాలు పెట్టామా అనేటట్టుగా వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. సీసీ కెమెరా ఫుటేజ్ తో పోలీసులకు సహాయం చేసినా, వారు తమకు రక్షణ కల్పించటంలో విఫలమయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. ఇంతకు ఏం జరిగింది.. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆ కుటుంబానికి కలిగిన నష్టం ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే…

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం పాతురు గమినీవారి వీధిలో దుర్గ భవాని తన భర్త, పిల్లలతో నివాసముంటున్నారు. జీవనోపాధి కోసం కర్రీ పాయింట్ నడుపుతున్నారు. తమ రక్షణ కోసం వారు నివసిస్తున్న ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే 8 నెలల క్రితం ఆ ప్రాంతం లో హత్య జరిగింది. దీంతో పోలీసులు దుర్గ భవాని వద్ద నుండి సీసీటీవీ ఫుటేజ్ కావాలని కోరారు. అయితే ఆమె సీసీ కెమెరా విజువల్స్ పోలీసులకు ఇవ్వడం వల్ల తనకు ఏదైనా సమస్య వస్తుందని భయపడింది. కానీ పోలీసులు మేమున్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సీసీ కెమెరాలు విజువల్స్ తీసుకెళ్లారు. అయితే ఆ సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నుంచి నిందితుడి బంధువులు దుర్గ భవాని కుటుంబంపై కక్ష పెంచుకుని దాడులకు తెగబడ్డారు. బాధితురాలు దుర్గ భవాని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయింది.

ఈ నేపథ్యంలో దుర్గ భవాని కుటుంబంపై గత రెండు రోజులుగా ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడి ఇటుక రాళ్లతో దాడి చేశారు. దుర్గ భవానిని సైతం మహిళ అని చూడకుండా దాడికి తెగబడ్డారు. అంతేకాక వారి ఇంటి ఎదురుగా బైకులు అడ్డుపెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితురాలు వాపోయింది. రాజకీయ నేపథ్యంలో వారి ఓట్లు ఎక్కడ పోతాయో అనే కారణంతో రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, పోలీసులు కూడా వారి ఒత్తిళ్లకు తలొగ్గి మాకు న్యాయం చేయకపోగా, తిరిగి మా పైన కేసులు పెడుతున్నారని ఆరోపించింది. రెండు రోజుల క్రితం దాడి జరిగినప్పుడు దిశ యాప్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఎందుకు దిశ యాప్ కు ఫోన్ చేశావని, పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కు ఎందుకు రాలేదని తన పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాధితురాలు దుర్గ భవాని ఆరోపిస్తోంది. తమ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు తమ పాలిట శాపంగా మారాయని, పోలీసులకు సహాయం చేసినందుకు తిరిగి సహకరించక పోగా తమపై దాడులు చేస్తున్న వారికి కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమని బాధితురాలు దుర్గ భవాని ప్రశ్నిస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే, దీనిపై పోలీసులు వేరే రకంగా చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. దానయ్య అనే వ్యక్తి తల్లి బట్టలు ఉతుకుతూ ఉన్న సమయంలో దుర్గ భవాని భర్త వెంకన్న సీసీ కెమెరాలతో వీడియో చిత్రీకరించాడని, దీంతో దానయ్య వెంకన్న కుటుంబంపై ఇటుక రాళ్లతో దాడి చేశాడని, ఆ దాడిలో వెంకన్న తో పాటు అతని కుటుంబ సభ్యులు గాయపడ్డారని, హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అంతేకాక దానయ్య పై వెంకన్న ఇటుక రాయి తో దాడి చేసినట్లు ఫిర్యాదు చేయగా దానిపై కూడా కేసు నమోదు చేశామని, ఇరువురు ఇదేవిధంగా ఘర్షణలకు దిగితే ఎమ్మార్వో దగ్గర బైండోవర్ చేస్తామని ఎస్సై వీరబాబు తెలిపారు.

అయితే, ఈ ఘటనలో బాధితురాలు ఒకే విధంగా చెబుతుంటే, పోలీసులు మరో విధంగా చెపుతున్నారు. పోలీసులకు హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఇచ్చినందుకే దాడులు జరిగాయని దుర్గ భవాని అంటుంటే, వీధి గొడవల కారణంగా ఘర్షణ తలెత్తిందని పోలీసులు అంటున్నారు. అంతేకాక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా పోలీసుల పై ఉన్న కారణంగానే తమకు న్యాయం జరగడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజానిజాలు బయటకు తీస్తే తప్ప అసలు నిజం బయటకు వచ్చే అవకాశం లేదు.

Follow Us