జనసేన గ్యారేజ్.. ఇచ్చట నాయకులు తయారు చేయబడును.. దరఖాస్తులకు ఆహ్వానం..
జనసేన కార్యకర్తల నుంచే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ కొత్త నాయకత్వ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయి నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థుల నాయకత్వ లక్షణాలను పరిశీలించి శిక్షణ ఇచ్చి, తుది ఎంపికపై పవన్ కల్యాణ్ నిర్ణయమే అమలవుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

మీరు జనసేన కార్యకర్తా.. నేతగా ఎదగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. అప్లికేషన్ సమర్పించండి అంటోంది ఆ పార్టీ అధిష్టానం. పైస్థాయిలో ఉండే లీడర్లు.. కిందిస్థాయి నేతలను నియమించడం, అన్ని పార్టీల్లో ఆనవాయితీగా వస్తోంది. అయితే జనసేన కార్యకర్తల నుంచే నేతలు పుట్టుకురావాలనే ఆలోచనకు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఓ ఆకారం ఇచ్చారు. దీంతో కార్యకర్తలను మాత్రమే కాదు.. పార్టీ కోసం నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీగా జనసేన మారుతోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామస్థాయిలో నేతలుగా ఎదగాలనే ఆసక్తి, రాజకీయ శక్తి ఉన్న జనసైనికులు, వీర మహిళలను ప్రోత్సహిస్తోంది.
నాయకత్వ లక్షణాలపై స్క్రూటినీ – అందుబాటులో 3 రకాల అప్లికేషన్లు
అభ్యర్థుల నుంచి ఐదు రోజుల పాటు అప్లికేషన్లు తీసుకుంటారు. దీనికోసం క్షేత్రస్థాయిలో 32మందితో పరిశీలన కమిటీ ఏర్పాటుచేశారు. అప్లికేషన్ తీసుకున్నాక, కార్యకర్తలు ఏ ఉద్దేశంతో వస్తున్నారు.. ఎలా పనిచేస్తారు.. వాళ్ల నాయకత్వ లక్షణాలపై స్క్రూటినీ చేస్తారు. దీనికోసం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో మూడు రకాల డెస్కులు ఏర్పాటుచేశారు. అక్కడ మూడు రకాల అప్లికేషన్లు ఇస్తారు. ఎవరు ఏ కేటగిరీ కింద అప్లయ్ చేయాలనుకుంటే, ఆ అప్లికేషన్ తీసుకోవచ్చు.
పార్లమెంట్ స్థాయి నాయకులు, అసెంబ్లీ స్థాయి నాయకులు, మండల, గ్రామస్థాయి…ఇలా రకరకాల స్థాయిల్లో నాయకులను నియమించుకునేందుకు, పార్టీ శ్రేణుల్లో ఆసక్తి ఉన్నవారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్.
క్షేత్రస్థాయిలో నాయకులను నియమించడంలో, పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి తేల్చిచెప్పారు. కార్యకర్తలే నేతలుగా ఎదిగితే…క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందనే ఆలోచనతో జనసేన ఈ కార్యాచరణ చేపట్టింది.
