Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!
శ్రీకాకుళం జిల్లా.. పలాస.. కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలో 'ఇదిగో తోక అంటే అదిగో పులి' అన్న చందంగా ఉంది పరిస్థితి. ఇటీవల తరచూ జరుగుతోన్న దొంగతనాలు, దోపిడీలతో పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. దొర ఎవరో.. దొంగ ఎవరో... తెలియనీ అయోమయ పరిస్థితినీ ఇక్కడి వారు ఫేస్ చేస్తున్నారు..

పలాస, మే 8: వాణిజ్య కేంద్రంగానూ పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీ ఎదుగుతుండటం, ఒరిస్సా రాష్ట్రానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ ఇటీవల గన్ కల్చర్, సుపారీ గ్యాంగ్లు, అంతరాష్ట్ర దొంగల కదలికలు పెరిగాయి. కిందటి నెల 7న కాశీబుగ్గలో GST అధికారులమని చెప్పి శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లోకి పట్టపగలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చొరబడి 800 KGల బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్లు 6నెలల ముందు నుండే రెక్కీ నిర్వహించి ఈ దోపిడికి పాల్పడ్డాయి. పోలీస్ అని ముద్రించి ఉన్న టీ షర్ట్ లు ధరించి, చేతిలో బేడీలు, రెండు తుపాకులు పట్టుకొని షాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘటనతో మరింతగా ఆందోళన చెందుతున్నారు ఇక్కడి స్థానికుకులు.
పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో కొత్తవారిని ఎవరిని చూసిన దొంగేమో అని అనుమానిస్తున్నారు ఇక్కడ ప్రజలు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఉదయం మున్సిపాల్టీ పరిధిలోని రెడ్డిక వీధిలో పెద్ద అలజడే జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకొని స్థంభానికి కట్టి దేహశుద్ధి చేశారు స్థానికులు. దానికి తోడు ఆ వ్యక్తి ఇంటి గోడలపైకి ఎక్కడం, వీధిలలో పార్క్ చేసి ఉన్న బైక్ లను తోసివేయటం వంటివి చేశాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని నిలదీయగా అతను హిందీలో మాట్లాడటంతో పాటు, పొంతన లేకుండా సమాధానం చెప్పడం చేశాడు. ఒంటిపై బట్టలు కూడా లేకుండా కేవలం టవల్ మాత్రమే కట్టుకొని సంచరిస్తున్నాడు ఆ వ్యక్తి.
దీంతో స్థంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు. అయితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్లి విచారించారు కాశీబుగ్గ పోలీసులు. విచారణ అనంతరం ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు తేల్చారు. అనుమానాస్పదoగా సంచరిస్తున ఆ వ్యక్తినీ స్థంభానికి కట్టి దేహశుద్ధి చేయడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిసి అయ్యో పాపం అంటూ అంతా నిట్టూర్చారు. మరోవైపు అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వారిపై దాడులు చేయొద్దని సూచిస్తున్నారు పోలీసులు. వారిపై పోలీసులకు సమాచారం ఇస్తే తగిన విచారణ జరుపుతామని అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




