Weather Report: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. మూడ్రోజుల పాటు రెయిన్స్.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ద్రోణి ప్రభాంతో వానలు పడతనున్నాయి. అటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణశాఖ జారీ చేసింది. ద్రోణి / గాలి విచ్చితి ఒకటి ఈరోజు తెలంగాణ ప్రాంతం నుండి రాయలసీమ అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ఏర్పడింది. నిన్న తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ఈరోజు తూర్పు బీహార్ నుండి జార్ఖండ్, ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతం వరకు సగటు సముద్రం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.నిన్న ఉత్తర అంతర్గత కర్నాటక నుండి మన్నార్ వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోని ఈరోజు బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.
మూడ్రోజుల పాటు రెయిన్ అలర్ట్
ఈ క్రమంలో ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు ఏమి లేదని తెలిపింది.ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈరోజు రాష్ట్రంలోని ఒకటి రెండు పశ్చిమ, తూర్పు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
తెలంగాణకు వర్షసూచన
అటు ఏపీలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని స్పష్టం చేసింది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
