Andhra Pradesh: చిన్నారిపై ఒలికిన వేడి వేడి గంజి.. ఒంటిపై తీవ్ర గాయాలు..!
Andhra Pradesh: అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, బాధ్యత గల అంగన్వాడీ అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణం. పసిపాప ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పట్టించుకోకుండా, తమ తప్పును..

Andhra Pradesh: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో దారుణ ఘటన వెలుగుచూసింది. 12వ వార్డు పరిధిలోని గౌడపాలెం అంగన్వాడీ కేంద్రంలో మూడు సంవత్సరాల పసిపాపపై గంజి ఒలకి తీవ్ర గాయాలయ్యాయి. అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యాfaనికి ఒంటిపై తీవ్రగాయాలతో తల్లడిల్లిపోయింది.
అద్దంకి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో షేక్ నిరూం అనే మూడేళ్ల పాపపై వేడి వేడి గంజి పడటంతో ఒళ్ళంతా తీవ్రంగా కాలిపోయింది. పాప కాళ్లు, చేతులపై పెద్ద పెద్ద బొబ్బలు లేచి, చర్మం ఊడిపోయిన దృశ్యాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఒంటిపై కాలిన గాయాలతో మంటను తట్టుకోలేక ఆ చిన్నారి రాత్రంతా గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది.
మరోవైపు ఈ ఘటనపై అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, బాధ్యత గల అంగన్వాడీ అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణం. పసిపాప ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పట్టించుకోకుండా, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే వారు ప్రయత్నించారని పాప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నానమ్మ ఆవేదన:
పిల్లలు బంతులతో ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేడి గంజి పాపపై పడటంతో తట్టుకోలేక అల్లాడిపోయింది. ప్యాంట్ విప్పేటప్పటికే చర్మం అంతా ఊడి వచ్చేసింది. మొదట పిల్లలే కింద పడ్డారని అబద్ధం చెప్పమన్నారు. కానీ నా మనవరాలు పడుతున్న నరకం చూడలేక నిజం చెప్పారు. రాత్రంతా పాప ఏడుస్తూనే ఉంది. దానితో పాటు మేమూ ఏడుస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు ఆ టీచర్ గానీ, ఆయా గానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని నానమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
అంగన్వాడీ అధికారులు నిర్లక్ష్య వైఖరిపై చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డకు న్యాయం జరగాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
