Vijayawada: విజయవాడ డోంట్ లైక్ ట్రాఫిక్.. బట్ ట్రాఫిక్ లైక్స్ విజయవాడ
ట్రాఫిక్.. ట్రాఫిక్.. ఏ నగరం చూసినా అదే సమస్య.. ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న విజయవాడలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ వాహనదారులకు చుక్కలు చూపెడుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం బెజవాడ వాసులకు శాపంగా మారింది. పూర్తి డీేటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. ఫ్లై ఓవర్లు పూర్తయినా తప్పని ట్రాఫిక్ నరకం తప్పడంలేదు. రాజధాని సెంటర్ ఆఫ్ ది పాయింట్గా, గేట్ వేగా విజయవాడ ఉండటంతో నగరంలోకి దారితీస్తున్న ప్రధాన మార్గాలు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డుపై నిత్యం విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడుతోంది. చెన్నై, కోల్కతా,హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు సైతం ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుకు కనెక్టయి ఉండటంతో వాహనాల రద్దీ మరింత పెరిగింది
విజయవాడలో కలిసిపోతున్న చుట్టుపక్కల గ్రామాలు
విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు నగరంలో కలిసిపోతున్నాయి. రాజధాని ప్రాంతంకావడంతో ప్రజలు కూడా ఎక్కువగా అక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవాలని కోరుకుంటారు. ప్రజల్లో నెలకొన్న ఈ ట్రెండ్తో విజయవాడ క్రమంగా విస్తరిస్తోంది. విద్యా, వ్యాపార, ఉద్యోగాల కోసం వచ్చే వారితో వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
విజయవాడ వేదికగా కొనసాగుతున్న కార్యకలాపాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం విజయవాడ వేదికగా కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. వీఐపీ, వీవీఐపీల రాకతోపాటు సెలబ్రెటీలు, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం, డిప్యూటీ సీఎం వివిధ దేశాల నుంచి వచ్చే అంబాసిడర్లు రాకపోకలతో విజయవాడ నిత్యం సందడిగా మారింది. పోలీసులకు ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం కత్తిమీద సాములా మారింది.
ట్రాఫిక్ రద్దీతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీతో ప్రత్యామ్నాయ మార్గాలపై నగర ట్రాఫిక్ విభాగం, పోలీసులు దృష్టి సారిస్తున్నారు. పనుల నిమిత్తం నగరంలోకి వస్తున్న వాహనాలను ప్రధాన మార్గాలకు అనుబంధంగా ఉన్న రోడ్లలోకి మళ్లిస్తూ తాత్కాలికంగా ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తున్నారు.
రూ.3.5కోట్లతో బుడమేరుపై నిర్మించిన వంతెన
విజయవాడ నగరంతో గ్రామాలను అనుసంధానించడానికి ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలున్నాయి. ఇందులో భాగంగా 3.5కోట్లతో బుడమేరుపై వంతెన నిర్మించారు. న్యూరాజరాజేశ్వరీపేట నుంచి విజయవాడ రురల్ గ్రామాలకు సులువుగా చేరుకోవడం కోసం బుడమేరుపై నిర్మించిన వంతెనను నిరుపయోగంగా గాలికోదిలేసారు అధికారులు. కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జి నిర్మిస్తే కనీసం పాదచారులకు కూడా ఉపయోగ పడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
ఆఘమేఘాలపై బుడమేరుపై బ్రిడ్జి పూర్తి
గత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణంకోసం ఇరిగేషన్ శాఖకు నిధులు విడుదల చేయడంతో బుడమేరుపై బ్రిడ్జిని ఆఘమేఘాల మీద నిర్మించారు. బ్రిడ్జిపై చిన్న చిన్న పనులు మినహా నిర్మాణమొత్తం పూర్తి చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.. విజయవాడ రూరల్ గ్రామాల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు, పశ్చిమ బైపాస్ నుంచి న్యూ ఆర్ ఆర్ పేటలోకి వచ్చేందుకు అనుసంధానంగా రహదారి నిర్మాణం జరుగలేదు. రహదారికోసం భూసేకరణ పూర్తి చేయకపోవడంతో బ్రిడ్జి నిరుపయోగంగా మారింది,
శాఖల మధ్య కొరవడిన సమన్వయం
ట్రాఫిక్ రద్దీ నివారణ, ప్రత్యామ్నాయ మార్గాలపై అటు కార్పొరేషన్ ఇటు ఇరిగేషన్, పొలీస్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో బ్రిడ్జి నిర్మాణం కల నెరవేరినప్పటికీ.. కనెక్ట్ చేసే రోడ్డు కల మాత్రం నేటికీ నెరవేరలేదు. కళ్లేదుటే వంతెన ఉన్నాప్రయోజనం లేకుండా పోయిందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరుపై నిర్మించిన వంతెన ప్రారంభం కాకుండానే దెబ్బతినే పరిస్థితికి చేరింది. వంతెనకు పైభాగంలో ఇరువైపులా కట్టిన రెయిలింగ్ బీటలు వారింది. ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి వంతెనకు ఇరు వైపులా రహదారిని ఏర్పాటు చేసి నిరుపయోగంగా ఉన్న వంతెనకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..