ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర.. మహిళ దారుణ హత్య!
గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామంలో ఈ నెల 7వ తేదీన జరిగిన దాది కోటేశ్వరమ్మ అనే మహిళ హత్య కేసును పెదకాకాని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను దారుణంగా హత్య చేసి, దోపిడీగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుపడుతోందన్న నెపంతోనే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వెనిగండ్లలో జరిగిన హత్య కేసును పెదకాకాని పోలీసులు చేధించారు. ఈ నెల ఏడో తేదిన వెనిగండ్లలో దాది కోటేశ్వరమ్మ అనే మహిళ హత్య జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు పోవడంతో వాటి కోసమే హత్య చేసినట్లు భావించారు. కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తు లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందన్న నెపంతో కోటేశ్వరమ్మను నిందితులు హత్యచేశారు.
వెనిగండ్లకు చెందిన దాది కోటేశ్వరమ్మ ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకొని ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. కుమార్తెకు వివాహం కావడంతో ఆమె అత్తగారింట్లో ఉంటుంది. కోటేశ్వరమ్మతో పాటు కొడుకు సాదిక్ నివసిస్తున్నాడు. సాదిక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అయితే సాదిక్ మరియకుమారి కుమార్తెను ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే కులాలు వేరు కావడంతో కోటేశ్వరమ్మ కొడుకు వివాహాన్ని ఒప్పు కోలేదు. దీంతో మరియకుమారి తన కుమార్తె వివాహానికి అడ్డు పడుతున్న కోటేశ్వరమ్మను హత్య చేసేందుకు సిద్దమైంది. మరియకుమారికి పరిచయం ఉన్న ఇద్దరు యువకులు సాయంతో ఏడో తేదిన హత్య చేసింది.
ముందుగా మరియ కుమారి ఇంట్లోకి వెల్లింది. ఆ తర్వాత ఇద్దరు యువకులు కోటేశ్వరమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమె కాళ్లు చేతులు పట్టుకొని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకొని వెళ్లి పోయారు. బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సిసి కెమెరా విజువల్స్ సాయంతో కేసును పోలీసులు చేధించారు. కోటేశ్వరమ్మను చంపేందుకు గతంలో రెండుసార్లు మరియకుమారి హత్యాయత్నం చేసినట్లు డిఎస్పీ మురళి క్రిష్ణ తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




