AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం… పసుపు బస్తాలు దగ్దం.. ఐదుగురికి గాయాలు

రాత్రి పది గంటల సమయంలో స్టోరేజ్ ప్రధాన ద్వారం తెరిచి లోపలికి వెళ్ళేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించారు. అయితే ద్వారం తెరుచుకోగానే మంటలు బయటకు వ్యాపించాయి. దీంతో ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీనివాసరెడ్డితో పాటు సహాయాధికారి కృష్ణా రెడ్డి మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు‌.

Andhra Pradesh: శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం... పసుపు బస్తాలు దగ్దం.. ఐదుగురికి గాయాలు
Accident In Cold Storage
T Nagaraju
| Edited By: Surya Kala|

Updated on: Jan 20, 2024 | 12:15 PM

Share

శుక్రవారం సాయంత్రం కోల్డ్ స్టోరేజ్ నుండి మొదట పొగ వెలువడింది. పెద్ద ఎత్తున పసుపు బస్తాలు దాచిన శీతల గిడ్డంగి నుండి పొగ వెలువడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి రాకుండా పోతుందేమోనని రైతులు భయాందోళనకు గురయ్యారు. అన్నదాతలు అనుకున్నట్లుగానే అగ్ని ప్రమాదం‌ పెద్దదయింది. మంటలు స్టోరేజ్ మొత్తం వ్యాపించి పసుపు బస్తాలు దగ్దం అయ్యాయి.

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పసుపు మార్కెట్ యార్డు ఉంది.. రాష్ట్రంలోనే ఈ మార్కెట్ అతి పెద్దది. ఇక్కడ ఒక్క గుంటూరు జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి రైతులు తమ పసుపు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో శీతల గిడ్డంగుల నిర్మాణం జరిగింది. శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం‌ చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయానికి మంటలు స్టోరేజ్ మొత్తం వ్యాపించి పసుపు బస్తాలను కాల్చి వేశాయి. మంటలను అదుపు చేసేందుకు ఐదు అగ్ని మాపక యంత్రాలను రంగంలోకి దించారు.

రాత్రి పది గంటల సమయంలో స్టోరేజ్ ప్రధాన ద్వారం తెరిచి లోపలికి వెళ్ళేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించారు. అయితే ద్వారం తెరుచుకోగానే మంటలు బయటకు వ్యాపించాయి. దీంతో ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీనివాసరెడ్డితో పాటు సహాయాధికారి కృష్ణా రెడ్డి మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు‌. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం సిబ్బంది పన్నెండు గంటలకు పైగా కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. తెల్లవారు జామున గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి స్టోరేజ్ ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అయితే  భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పసుపు బస్తాలు కాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రంగా నష్టపోయామంటున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ గుంటూరు నగరం చుట్టూ ఉన్న శీతల గోదాముల్లోనూ అగ్ని ప్రమాదాలు జరిగి మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భీమా సొమ్ము కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఘటనలో ఉన్నాయి. ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం‌లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..