Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ పేరుతో దోపిడీ
విజయవాడ రైల్వే స్టేషన్లో వెహికల్ పార్కింగ్ చేసి, ఊరికి వెళుతున్నారా? అయితే భద్రం బీకేర్ఫుల్. మీ జేబుకు భారీ చిల్లు పడడం గ్యారంటీ. జనరల్ పార్కింగ్ ఉన్నప్పటికీ, ప్రీమియం పార్కింగ్ పేరుతో వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక చార్జీలతో ఎడాపెడా దోచుకుంటున్నారు.

విజయవాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఫీజులు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజుకు 2లక్షలమంది రాకపోకలు సాగించే అతి పెద్ద రైల్వే స్టేషన్లో టూ వీలర్లు, ఫోర్ వీలర్లు పార్కింగ్ చేయాలంటే వాహనదారులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్లో ఊరు వెళ్లి వచ్చే చార్జీల కంటే, పార్కింగ్ చార్జీలు ఎక్కువైపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రీమియం పార్కింగ్ పేరుతో గంటగంటకు చార్జీల బాదుడు పెరిగిపోతోంది. ఉద్యోగం కోసం డైలీ వేరే ప్రాంతాలకు వెళ్లేవాళ్లకు, ఈ పార్కింగ్ చార్జీల భారం తడిసి మోపెడవుతోంది. రైల్వే అధికారులు యూనిక్ పాలసీ ప్రకారం టెండర్లు పిలుస్తున్నామని చెబుతున్నారు. కానీ వాహనాలు పార్కింగ్ చేసే ప్రయాణికుల జేబులకు మాత్రం భారీగా చిల్లు పడుతోంది.
అసలు విజయవాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ చార్జీల డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. టూ వీలర్కు గంటకు రూ. 12 చార్జీ వసూలు చేస్తున్నారు. 12 గంటలకు 144 రూపాయల పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు. 24 గంటలకు 288 రూపాయల చార్జీ అని చెబుతున్నారు. ఫోర్ వీలర్కు అయితే గంటకు రూ. 50 పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు రూ. 50 చొప్పున వడ్డిస్తున్నారు. 12 గంటలకు రూ. 400 నుంచి 500 తీసుకుంటున్నారు. 24 గంటలకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. GSTతో కలిపి వడ్డిస్తూ ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్నారు. పార్కింగ్ బాదుడు మరీ ఎక్కువైపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. పార్కింగ్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక రైల్వేస్టేషన్లో నాలుగు నాన్ ప్రీమియం పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి. వెస్ట్, నార్త్, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ రోడ్డు వెంబడి పార్శిల్ బ్లాక్ వైపు.. ఇలా నాన్ ప్రీమియం పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ మూడు గంటలకు 12 రూపాయలు వసూలు చేస్తున్నారు. మూడు గంటలయ్యాక మళ్లీ మూడు గంటలకు 12 రూపాయలు చెల్లించాలి. రైల్వేస్టేషన్కు రోజూ లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో నిత్యం లక్షమందికి పైగా తమ వాహనాలను పార్కింగ్ ప్లేస్లో ఉంచుతారు. దీన్ని బట్టి చూస్తే ప్రయాణికుల నుంచి కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని తెలుస్తోంది. ఇక విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 18 వేల మంది రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లు కూడా పార్కింగ్ దోపిడీకి గురవుతున్నారు.
రైల్వేశాఖ నిబంధనల ప్రకారం పార్కింగ్ నిర్వాహకులు ఖచ్చితంగా నెలవారీ పాసులు ఇవ్వాలి. ఈ పాసుల కోసం ఎవరైనా ప్రయాణికులు అడిగితే, పాసులు పరిమితంగా ఉన్నాయని, అందరికి ఇవ్వడం సాధ్యం కాదని చెబుతూ, పార్కింగ్ దోపిడీ కొనసాగిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ దోపిడీపై ప్రయాణికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




