Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు..

ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. 15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. పెద్దశబ్దంతో భూమి కంపించడంతో వస్తువులు కిందపడిపోయాయి. గోడలు స్వల్పంగా బీటలువారాయి. కాగా, గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భయంతో అయా గ్రామాల ప్రజలు రాత్రంతా రోడ్ల పైనే గడిపారు. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
