Andhra News: మొంథా తుఫాన్ డ్యామేజ్.. కేంద్రానికి నివేదిక సమర్పించిన మంత్రి లోకేష్, అనిత!
ఏపీలో 'మోంథా' తుపాను సృష్టించిన బీభత్సానికి వాటిళ్లిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించారు మంత్రులు లోకేష్, వంగలపూడి అనిత. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఇద్దరు మంత్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో సమావేశం అయి ఈ నివేదికలను అందజేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రలు లోకేష్, వంగలపూడి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ‘మోంథా’ తుపాను సృష్టించిన బీభత్సానికి వాటిళ్లిన నష్టంపై నివేదిక సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర నష్టం మిగిల్చిన మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వారు కేంద్రమంత్రికి వివరించారు.
తుపాను కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. అక్టోబర్ 28వ తేదీ రాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటిందని.. ఆ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు భారీవర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అప్రమత్తమై 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించింది. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు, ఇతర వస్తువులను అందించడంతో ప్రమాద తీవ్రతను తగ్గించినట్టు తెలిపారు.
ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3వేలు అందించామని.. ఇదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టిందని వివరించారు. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు స్పష్టం చేశారు.
మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల ఇలా మొత్తంగా రూ.6,356 కోట్ల నష్టం వాటినట్టు పేర్కొన్నారు.
NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవని.. ఈనెల 12వ తేదీన తాము సమర్పించిన నివేదికపై కేంద్రమంత్రుల బృందం (IMCT) ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమిత్ షాను కలిసిన వారిలో హోం మంత్రి అనిత, రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
