AP News: పోలీసులును చూసి కంటైనర్ను ఆపకుండా దూసుకెళ్లారు.. ఛేజ్ చేసి.. ఆపి చెక్ చేయగా..?
గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను పట్టించుకోవడం లేదు. వాహనాలకు అడ్డొస్తే.. దూసుకుంటూ వెళ్లిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం గారబంద వద్ద గంజాయిని కంటైనర్లో నింపి పలాస మీదుగా చెన్నై తరలిస్తున్నారని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందింది. పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులకు స్మగ్లర్లు షాక్ ఇచ్చారు.
అది చెన్నై నుంచి ఒడిశా వెళ్లిన కంటైనర్. అందులో రహస్యంగా గంజాయి తరలిస్తున్నారని.. ఆంధ్రాలోని శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కంటైనర్ వస్తున్న రూట్ను బట్టి.. నెమలి నారాయణపురం హైవేపై కాపు కాశారు. కంటైనర్ రావడంతో.. దాన్ని ఆపారు. తనిఖీ చేయాలని.. డోర్లు ఓపెన్ చేయాలని డ్రైవర్ను కోరారు. అతడు.. ఎస్కేప్ అయ్యేందుకు కంటైనర్ను ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. అక్కడే ఉన్న పోలీసులు.. పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని.. శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమై… వారు కంటైనర్ గురించి వైజాగ్ ఆనందపురం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు భీమిలి క్రాస్ జంక్షన్ వద్ద కంటైనర్ కోసం నిఘా పెట్టారు. అనూహ్యంగా అక్కడ కూడా కంటైనర్ను ఆపలేదు డ్రైవర్. రెట్టింపు వేగంతో దూసుకుపోయాడు.
దీంతో పోలీసులు ఛేజింగ్ మొదలెట్టారు. దీంతో ఇక లాభం లేదని భావించిన కంటైనర్ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని ఓ పక్కన ఆపి ఎస్కేప్ అయ్యారు. సదరు వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పరిశీలించడగా.. ప్రొక్లెయిన్ స్పేర్ పార్ట్స్తో పాటు 13 సంచుల్లో తరలిస్తున్న 386 కేజీల గంజాయిని గుర్తించారు. పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు.
ఈ ఘటనలో ఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుళ్లు సంతోష్ చేతికి, సురేష్ గాయపడ్డారు. ఈ ముగ్గురూ హెల్మెట్స్ పెట్టుకోవడం వల్లే ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా గంజాయి అక్రమ రవాణాను కేటుగాళ్లు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరింత ఫోకస్ పెంచారు. ప్రైవేట్ వాహనాలు మాత్రమే కాకుండా.. బస్సుల్లో, రైళ్లలో తరలిస్తున్న గంజాయిని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..