AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడ్డూ కాదు.. రూ.2.21 లక్షలు పలికిన విఘ్నేశ్వరుడి ప్రతిమ!.. విగ్రహాన్ని ఏం చేస్తారో తెలుసా?

వినాయక నిమజ్జనం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణనాథుడి చేతితోని లడ్డూను వేలం వేయడం మనం అందరికీ తెలిసిందే.. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం ఏకంగా ఆ గణపయ్య విగ్రహాన్నే వేలం వేశాడు.. ఈ వేలం గణపయ్య విగ్రహాన్ని ఏకంగా రూ. రూ.2.2 లక్షలకు దక్కించుకున్నారు ఓ రైతు. ఇంతకూ ఆ గ్రామం ఏదనేగా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

లడ్డూ కాదు.. రూ.2.21 లక్షలు పలికిన విఘ్నేశ్వరుడి ప్రతిమ!.. విగ్రహాన్ని ఏం చేస్తారో తెలుసా?
Eco Friendly Idol Sells For Rs 2.2 Lakh In East Godavari
B Ravi Kumar
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 7:17 AM

Share

ఏలూరు: వినాయక నవరాత్రులు ముగింపు దశకు చేరుకోగానే తెలుగు లోగిళ్లలో లడ్డూ వేలం పాటల సందడి మొదలవుతుంది. బాలాపూర్ లడ్డూ మొదలుకొని గల్లీల్లోని మండపాల వరకు నిర్వాహకులు లడ్డూ ప్రసాదాన్ని వేలం వేసి నిధులు సేకరించడం సర్వసాధారణం. అయితే, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఉండ్రాజవరం మండలం ‘చివటం’ గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నమైన, అరుదైన సాంప్రదాయం కొనసాగుతోంది.

ఇక్కడ లడ్డూ కోసం కాకుండా, సాక్షాత్తూ పూజలందుకున్న ‘మట్టి వినాయకుడి ప్రతిమ’ కోసమే భక్తులు పోటాపోటీగా వేలం పాట పాడతారు. ఈ ఏడాది సైతం ఆ ఆనవాయితీ ఘనంగా పునరావృతమైంది. చివటంలో ప్రతిష్ఠించిన పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమ బహిరంగ వేలంలో ఏకంగా రూ.2,21,500 పలికి స్థానికులను ఆశ్చర్యపరిచింది.

చివటం గ్రామంలో భక్తి పారవశ్యం: హోరాహోరీగా సాగిన వేలం పాట

గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని కమిటీ సభ్యులు మట్టి ప్రతిమను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, నవరాత్రుల పాటు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాలు ముగిసిన అనంతరం గ్రామస్థుల సమక్షంలో ఆ ప్రతిమకు బహిరంగ వేలం నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు పోటీ పడటంతో పాట క్షణక్షణానికీ రసవత్తరంగా మారింది.

చివరకు గ్రామానికి చెందిన భక్తుడు ముత్తా నాగేశ్వరరావు అత్యధికంగా రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు పాడుకుని ఆ పవిత్ర ప్రతిమను కైవసం చేసుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ ప్రతినిధులు సకల మర్యాదలతో ఆ మట్టి గణపతిని ఆయనకు అందజేశారు.

పొలాల్లో ప్రతిష్ఠిస్తే సిరుల పంట: తరతరాల విశ్వాసం

గణపతి ప్రతిమను అంత భారీ ధరకు దక్కించుకోవడం వెనుక తరతరాలుగా వస్తున్న ఒక బలమైన నమ్మకం దాగి ఉంది. పూజలందుకున్న ఈ మట్టి వినాయకుడిని తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఉంచితే ప్రకృతి వైపరీత్యాలు తొలగి, పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామ రైతులు విశ్వసిస్తారు. వేలం పాటలో విజేతగా నిలిచిన ముత్తా నాగేశ్వరరావు సైతం ఈ ప్రతిమను తమ పొలంలో ఉంచి, అక్కడే పూజాదికాలు కొనసాగిస్తామని తెలిపారు. సాగును నమ్ముకున్న అన్నదాతలకు ఈ ప్రతిమ ఒక రక్షారేకులా, పాడిపంటలను కటాక్షించే దైవంగా భావించడం ఇక్కడి విశేషం.

సంప్రదాయానికి ప్రతీకగా గ్రామీణ సంస్కృతి సాధారణంగా నవరాత్రుల తర్వాత విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ, పవిత్రమైన మట్టి విగ్రహాన్ని నేలలోనే కరిగిస్తూ, అది భూమిని మరింత సారవంతం చేస్తుందన్న భావనతో పాటు, స్వామివారి కృప పంటలపై ఉంటుందన్న గ్రామీణుల నమ్మకం అభినందనీయం. పర్యావరణ స్పృహను, అచంచల భక్తిని కలగలిపిన చివటం గ్రామస్థుల ఈ ప్రత్యేక ఆచారం నేడు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us