Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు.. నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన పదో తరగతి క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ ఘటనలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ రద్దు అయింది. ఈ మేరకు చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్‌ 30 లోపు పోలీసుల..

Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు.. నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆదేశాలు..
Former Minister Narayana

Updated on: Oct 31, 2022 | 2:49 PM

ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన పదో తరగతి క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ ఘటనలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ రద్దు అయింది. ఈ మేరకు చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్‌ 30 లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నారాయణకు బెయిల్‌ ఇవ్వడం సమంజసం కాదని, రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై చిత్తూరు కోర్టు విచారణ జరిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ప్రశ్న పత్రం లీకైంది. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు తెలిపారు. ఆయనను అరెస్ట్‌ చేసి, చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అయితే.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014 లోనే ఆయన వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు అప్పట్లో బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా ఆ బెయిల్‌ను రద్దు చేసింది.

పదో తరగతి ప్రశ్న పత్రాలు లీకైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం పేపర్ లీక్‌ అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. సోషల్ మీడియాలో 11 గంటల సమయానికి సర్క్యులేట్ అయినట్టుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. పదో తరగతి పరీక్ష 9.30 గంటలకే ప్రారంభమైందని, కాబట్టి దీన్ని లీక్‌గా భావించలేమని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నామన్న కమిషనర్‌.. వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వదంతులొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జెడ్పీ పాఠశాల నుంచి ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించామని కమిషనర్‌ సురేశ్‌ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పశ్నపత్రం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Follow Us