Eluru: టవల్ చుట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాలుడు.. అతడు చెప్పింది విని పోలీసులు అవాక్కు
ఏలూరులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టవల్ చుట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కారణం తెలిసి పోలీసులు ఒకింత అవాక్కయ్యాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
ఓ పదేళ్ల బాలుడు తన తల్లిపై కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. అతను ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం టవల్ చుట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. బాలుడిని చూసిన పోలీసులు ఎందుకొచ్చావని ప్రశ్నించారు. అందుకు బాలుడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. తన ఫ్రెండ్ పుట్టిన రోజుకు వెళ్లడానికి వాళ్లమ్మ చొక్కా ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.
జిల్లాలోని కొత్తపేటకు చెందిన సాయి దినేష్ నాలుగో తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో చనిపోయింది. దాంతో దినేష్ తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా దినేష్ తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లడానికి బయలుదేరాడు. స్నానం చేసి తన సవతి తల్లిని పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు వైట్ షర్ట్ ఇవ్వాలని కోరాడు. అయితే ఆమె షర్టు ఇవ్వడానికి నిరాకరించి, దినేష్ని ఆ వేడుకకు వెళ్లొద్దని హెచ్చరించింది. దీంతో దినేష్ మారాం చేయడం ప్రారంభించాడు. ఆమె కోపంతో బాలుడ్ని మందలించి.. 2 దెబ్బలు వేసింది. దాంతో దినేష్ ఒంటికి టవల్ చుట్టుకుని నేరుగా ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. అక్కడ తన సవతి తల్లి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దినేష్ తండ్రిని సవతి తల్లిని స్టేషన్కి పిలిపించి పిల్లల పట్ల ప్రేమతో ఉండాలని సూచిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే దినేష్ కూడా తల్లిదండ్రులపై గౌరవంతో మెలగాలని చెప్పారు. కాగా అల్లరి చేశాడని గత ఏడాది సాయిదినేష్కు ఈ సవతి తల్లి వాతలు పెట్టింది. అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..