తమ చిన్నారి ప్రాణాలను కాపాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని.. బాలిక హనీ తల్లిదండ్రులు బుధవారం కలిశారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు.. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్బంగా వారితో సీఎం జగన్ సరదాగా ముచ్చటించారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ ను చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. ప్లకార్డు చూసి స్పందించిన సీఎం జగన్ వెంటనే వారికి ఆపన్నహస్తం అందించారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ చికిత్స కోసం అప్పటికప్పుడే రూ.1 కోటి మంజూరు చేశారు. దీంతోపాటు చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తుందని హామీనిచ్చి.. నేరవేర్చారు.
అయితే, ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాలతో చికిత్స అందుకుంటూ హానీ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. ప్రస్తుతం వ్యాధి నుంచి కోలుకుంటోంది. ఈ తరుణంలో బుధవారం హానీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు సీఎం వైయస్.జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి హనీని సీఎం ఆశీర్వదించి సరదాగా సంభాషించారు. పాపకు అందుతున్న చికిత్స తదితర వివరాలను తెలుసుకున్న సీఎం జగన్.. ఏమైనా సహాయం కావాలంటే సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచించారు.
కాగా, గతేడాది జూలై 26న గోదావరి వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమలో పర్యటించారు. ఈ సందర్బంగా బాధితులను పరామర్శించి గంటిపెదపూడిలోని హెలీప్యాడ్ వద్దకు తిరిగి వెళుతున్న సీఎం జగన్కు ప్లకార్డు పట్టుకుని ఉన్న హనీ తల్లిదండ్రులు కనిపించారు. వెంటనే వారిని తన వద్దకు పిలిపించుకున్న సీఎం వైఎస్ జగన్ హనీకి వచ్చిన వ్యాధి, చికిత్స వివరాలను తెలుసుకుని పాప వైద్యానికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చి.. వారికి ఆపద్భాంధవుడిగా నిలిచారు. రూ. కోటి మంజూరు చేయడంతోపాటు.. నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ అందిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..