AP Weather: ఆ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు.. పెరగనున్న చలి తీవ్రత.. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మొత్తానికి వర్షాలు అయితే ఏపీని వీడాయ్. ఈలోపే చలి పంజా విసిరింది. చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య /తూర్పు గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం వద్ద తూర్పు హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడనము అదే ప్రాంతంలో కొనసాగుతుంది. తదుపరి 48 గంటలు ఈ అల్పపీడనము పశ్చిమ దిశగా దక్షిణ బంగాళాఖాతం మీద నెమ్మదిగా కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
ఈరోజు, రేపు, ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఈరోజు : పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి : తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ :-
ఈరోజు, రేపు, ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
పెరిగిన చలి తీవ్రత….
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం పూట ఇంటి నుంచి బయటకి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. అందమైన ఆంధ్రా పల్లెల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలపు సాయంత్రాలు…నులివెచ్చని ఉషోదయాలతో పల్లెప్రాంతాలు మరింత అందాలు ఒలకబోస్తున్నాయి. పొగమంచుతో మన్యం తడిచి ముద్దవుతోంది. మరోవైపు ఆదివాసీ ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ లో గత కొద్ది రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణుకుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం పది గంటలైనా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. చలికి తోడు అతి చల్లని గాలులు జనంపై అటాక్ చేస్తున్నాయ్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఏ మూలకు వెళ్లినా ఇదే సిట్యువేషన్. నీళ్లు సైతం గడ్డ కట్టే స్థాయిలో టెంపరేచర్స్ పడిపోతున్నాయ్. మెజారిటీ ఏరియాస్లో ఐదు కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయ్. ఇక, అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాలు, ఆదివాసీ ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. మంచు దుప్పటి కప్పేస్తుండటంతో జనం అవస్థలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ఒక్కసారిగా 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం భయటకి రావాలంటేనే జంకుతున్నారు. వాకర్స్ సైతం ఉదయం నడకకు దూరమవుతున్నారు. ఈ చలి తీవ్రత మరి కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అటు చలి తీవ్రతతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..