AP Weather Alert: బలపడిన అల్పపీడనం.. కోస్తాలో నేడు భారీ వర్షాలు..
AP Weather Alert: అల్పపీడన ద్రోణి బలపడడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని..
AP Weather Alert: అల్పపీడన ద్రోణి ఒడిశా తీరంలో బలపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావారణ శాఖ తెలిపింది. దీంతో కోస్తా జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిసింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, మంగళవారం అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అనకాపల్లి, పల్నాడు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది.
పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో మంగళవారం ఉదయం 23.5 మి.మీ.వర్షపాతం, అలాగే కారంపూడి మండలంలో 18.5 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తరకోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావారణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.