గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది ఏపీ సర్కార్. యాంటీ నార్కోటిక్ టాస్క్ఫోర్స్.. బోర్డర్లో చెక్పోస్ట్లను పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. వంద రోజుల్లో గంజాయి కట్టడి దిశగా ముందుకెళ్తోంది ప్రభుత్వం.
గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని డిసైడైంది ఏపీ ప్రభుత్వం. ప్రధానంగా గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు యుద్ధప్రాతిపదికన సన్నద్ధమవుతోంది. ఇందులోభాగంగా మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన భేటీకి నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్, సంధ్యారాణి హాజరయ్యారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై సబ్ కమిటీ చర్చించింది. మత్తు పదార్థాల రవాణాను నియంత్రించేందుకు జిల్లాలవారీగా యాంటీ నార్కొటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసులకు కమిటి ఆదేశాలిచ్చింది. గంజాయి బాధితులకు డి అడిక్షన్ కేంద్రాలపైనా ఫోకస్ చేస్తూనే.. ప్రతీ జిల్లాకు టోల్ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటిదాకా 5వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్టు ఓ అంచనా. ఇందులో సాగు వేసే లోగా నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
కొంతమంది గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయిని సప్లయ్ చేస్తున్నారన్నారు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. అలాంటివారి కారణంగా చాలామంది జైళ్లలో మగ్గిపోతున్న పరిస్థితి ఉందన్నారు. గంజాయి వైపు వెళ్లకుండా ఇతర పంటల సాగుకి గిరిజనుల్ని మళ్లించడం. అలాగే ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది కేబినెట్ సబ్ కమిటీ. అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు పంపించింది. ఫైనల్గా వందరోజుల్లో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఇది చదవండి: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..