HeatStroke Alert: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే కొన్ని జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాల్లో, పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
శనివారం రాష్ట్రంలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు
మరోవైపు శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో 44.8 డిగ్రీలు, కడపలో 44.2 డిగ్రీలు, అనంతపురం(జి) రాయదుర్గం, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44 డిగ్రీల, మార్కాపురం(జి) కంభం, శ్రీసత్యసాయి(జి) తలుపలలో 43 డిగ్రీలు, అన్నమయ్య(జి) నూలివీడు, పల్నాడు(జి) గురజాలలో 42.7డిగ్రీలు, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42.6 డిగ్రీలు, తిరుపతి(జి) బేస్తపల్లిలో 42.5డిగ్రీలు, అనకాపల్లి(జి) దేవరపల్లె, పోలవరం(జి) ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకుగాను 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపిలాంటివి ధరించాలని.. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
