Chandrababu Naidu: ఇవేం విధానాలు.. ఇలా అయితే కష్టం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ..

|

Jun 17, 2021 | 7:47 AM

Chandrababu Naidu: ధాన్యం బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu: ఇవేం విధానాలు.. ఇలా అయితే కష్టం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ..
Chandrababu Naidu
Follow us on

Chandrababu Naidu: ధాన్యం బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రిని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తాను రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారినే నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు చంద్రబాబు. జగన్ రెడ్డి పాలనలో 21 రోజులకు పెంచినా.. బకాయిలు చెల్లించడం లేదన్ నారు. ధాన్యం కొనుగోళ్లు చేసి ఇప్పటి వరకు రెండు నెలలు దాటినా ఉలుకూ, పలుకు లేదని విమర్శించారు.

పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు?, ఖరీఫ్ కు పెట్టుబడులు ఎవరిస్తారు? అని ముఖ్యమంత్రిని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. రాయలసీమలో మొత్తం వేరుశనగ పంట నష్టపోయినా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేని ఆరోపించారు. అలాగే రాయలసీమలో అరకొరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టారని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో హడావుడి చేశారు తప్ప.. రైతులకు ఒనగూడిన ప్రయోజనం శూన్యం అన్నారు. ఇక కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని చంద్రబాబు ఆరోపించారు. సున్నావడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లోనూ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతు భరోసా పథకంలోనూ కౌలు రైతులకు మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ-క్రాప్ లో నమోదు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మిల్లర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వరి కే కాకుండా.. ఇతర పంట ఉత్పత్తులకు కూడా మద్దతు ధరలు లభించడం లేదన్నారు. ఆయా పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన పంటలకు తక్షణమే చెల్లింపులు జరపాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Also read:

AP Exams: ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్..