Jagananna Smart Townships: మధ్య తరగతి సొంతింటి కల.. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

|

Jan 11, 2022 | 10:31 AM

ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోకీలక నిర్ణయం తీసుకున్నారు.

Jagananna Smart Townships: మధ్య తరగతి సొంతింటి కల.. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
Jagananna Housing Scheme
Follow us on

 Jagananna Smart Townships: ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోకీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ నేడు ప్రారంభించనున్నారు.

మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్ధలాలు (ప్లాట్లు) కేటాయించి వారి సొంతింటి కలను సాకారం చేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ సర్కార్ పేర్కొంది. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తారు. నేటి నుంచి http://migapdtcp.ap.gpv.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) వారికి అనువైన ధరల్లో లిటిగేషన్లకు తావులేని స్ధలాలు కేటాయిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. మొదటి దశలో అనంతపురము జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఔట్లలో రేపటి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, త్వరలో మలిదశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ రోజు సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వెబ్‌సైట్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అన్ని పట్టణాభివృద్ది సంస్ధల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగ నియమాల మేరకు ఒక సంవత్సర కాలంలో సమగ్ర లేఔట్ల అభివృద్ది చేయనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేటుతో కేటాయింపు చేయనున్నారు. ఒక సంవత్సర వ్యవధిలో 4 వాయిదాలలో చెల్లించే సౌకర్యం, చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్‌ చేసిన ప్లాట్‌ లబ్ధిదారునికి స్వాధీనం చేయనున్నారు. దరఖాస్తుతో పాటు ప్లాటు విలువలో 10 శాతం, అగ్రిమెంట్‌ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్‌ తేది లోపు ఏది ముందయితే అప్పటికి మిగిలిన 30 శాతం చెల్లించే వెసులుబాటును కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5 శాతం మేరకు ఆకర్షణీయమైన రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్లాట్లను కేటాయించనున్నారు.

లేఔట్ల ప్రత్యేకతలు

  • న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్‌ డీడ్, గవర్నమెంటే లేఔట్‌ చేస్తుంది
  • కుటుంబాల అవసరాలను బట్టి 150,200 మరియు 240 చదరపు గజాల స్ధలాలు ఎంచుకునే వెసులుబాటు
  • పర్యావరణ హితంగా ఉండేలా లేఔట్ల విస్తీర్ణంలో 50 శాతం వరకు స్ధలం సామాజిక అవసరాలకు కేటాయింపు
  • విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్‌
  • మంచినీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్ధ, వరద నీటి డ్రెయిన్లు
  • విద్యుదీకరణ మరియు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలు
  • పార్కులు, ఆట స్ధలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు
  • వాణిజ్య సముదాయం, బ్యాంకు మరియు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్ధలాలు కేటాయింపు
  • లేఔట్‌ నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ మరియు పట్టణాభివృద్ది సంస్ధల ద్వారా సంయుక్త నిర్వహణ

Read Also….  TTD Recruitment: తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా జీతం..