Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు.. రాష్ట్రంలో మినీ మార్టులు..
ఏపీలోని ప్రజలకు రాష్ట్ర సర్కార్ తీపికబురు అందించింది. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో మినీ మార్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాబోయే రోజుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. తొలుత వెయ్యి మార్టులను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెయయి మినీ మార్టులు తొలి విడతలో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
మిల్లెట్స్ కూడా అందుబాటులో..
ఇక మినీ మార్టుల్లో మిల్లెట్స్ను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్టుల ద్వారా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు ప్రజలకు సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఇక అరుకు కాపీని దేశవ్యాప్తంగా మిలిటరీ క్యాంటీన్లలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వెయ్యి మినీ మార్టులను ఏర్పాటు చేస్తామని, విడతల వారీగా వీటిని విస్తరిస్తామని స్పష్టం చేశారు. పౌరసరఫరాల వ్యవస్థను బలోపేతం చేయడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ఈ మినీ మార్టులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
తక్కువ ధరకే
కంది, మినప ఎన్సీసీఎఫ్ సంస్థనే సరఫరా చేసి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందిస్తుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇక ప్రజలకు నాణ్యమైన సేవలను అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. సరఫరా వ్యవస్థలో సమన్వయం పెంచడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఢిల్లీ పర్యటన కొనసాగించినట్లు పేర్కొన్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. రేషన్ దుకాణాలను విస్తరించడంతో పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషణ్ వివరాలు అన్నీ తెలుస్తాయి. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఎంత కోటా సరుకులు తీసుకున్నారనే వివరాలు అన్నీ వచ్చేస్తాయి. అలాగే రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదారతో పాటు రాగులు, జొన్నలు వంటి కూడా సరఫరా చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో కందిపప్పు, గోధుమలు వంటి వాటిని కూడా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
