
పార్టీ ఫిరాయించారంటూ 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితోపాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు పడింది. టీడీపీ, వైసీపీ విప్లు చేసిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను పరిశీలించిన స్పీకర్, 8 మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు. దీంతో 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్లు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…