సుగాలి ప్రీతి కేసులో సీఎం సంచలన నిర్ణయం.. కుటుంబసభ్యులకు భరోసా..!
Sugali Preethi case: 2017లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును సీబీఐకు రిఫర్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సుగాలి ప్రీతి కుటుంబసభ్యులకు జగన్ భరోసా ఇచ్చారు. కంటి వెలుగు మూడో దశ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జగన్ కర్నూల్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి సహా కుటుంబసభ్యులు జగన్ను కలుసుకున్నారు. […]
Sugali Preethi case: 2017లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును సీబీఐకు రిఫర్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సుగాలి ప్రీతి కుటుంబసభ్యులకు జగన్ భరోసా ఇచ్చారు.
కంటి వెలుగు మూడో దశ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జగన్ కర్నూల్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి సహా కుటుంబసభ్యులు జగన్ను కలుసుకున్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంకు విఙ్ఞప్తి చేశారు. వారి విఙ్ఞప్తిపై సానుకూలత వ్యక్తం చేసిన జగన్.. తప్పక న్యాయం జరుగుతుందని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబాన్ని ఆదుకుంటామని, వారికి అండగా నిలుస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంపై మరోసారి కూలంకషంగా మాట్లాడేందుకు, తన వద్దకు రావాలంటూ సూచించారు. ఈ మేరకు తన కార్యాలయ అధికారులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోన్న పార్వతి, రాజు నాయక్ కుమార్తె సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెప్పింది. అయితే తన కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక పోస్ట్మార్టంలోనూ ప్రీతిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కుటుంబసభ్యులు స్కూల్ యజమానితో పాటు అతడి కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిటీ కూడా ప్రీతిని హత్యాచారం చేశారని నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో అప్పట్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి కుటుంబసభ్యులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలంటూ కర్నూల్లో రెండు రోజులు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.