గోదావరి జలాల సమర్థ వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జలవనరుల శాఖపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీటిని సరిగ్గా వినియోగించుకునేందుకు కూడా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశాలిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రధానమని గత సమీక్షలోనే స్పష్టంచేసిన సీఎం.. ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే వెలుగొండ, హంద్రీనీవా, వంశధార సహా రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఇక వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా జగన్ సమీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమీక్షకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ సమీక్షకు హాజరుకానున్నారు.