Andhra Pradesh: ఒంగోల్ గనులశాఖలో అవినీతి జలగలు.. కోట్లలో కూడబెట్టిన సర్వేయర్!
భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ అక్రమ ఆస్తుల పై నెల్లూరు ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. విజయవాడలో నివాసం ఉంటున్న సర్వేయర్ అబ్దుల్ ఆసిఫ్.. ఒంగోలు మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో..

ఒంగోలు, ఫిబ్రవరి 6: ఒంగోలు మంగమూరు రోడ్డులోని భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ అక్రమ ఆస్తుల పై నెల్లూరు ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. విజయవాడలో నివాసం ఉంటున్న సర్వేయర్ అబ్దుల్ ఆసిఫ్.. ఒంగోలు మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో నెల్లూరులో పనిచేశారు. ఆసిఫ్ ప్రస్తుతం ఒంగోలులో పనిచేస్తుండగా ఆయనపై ఆదాయానికి మించి ఆస్థులు ఉన్నట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విజయవాడలోని ఆయన నివాసం, ఆయన స్వగ్రామం మార్కాపురం, అత్తగారి ఊరైన కనిగిరిలలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సొదాలు నిర్వహించారు. ఒంగోలు మైన్స్ కార్యాలయంలో పలు రికార్డులు తనిఖీలు చేశారు. సర్వేయర్ ఆసిఫ్లను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. మైన్స్శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఆ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపింది.
అవినీతి ఆరోపణల్లో ఒంగోలు మైన్స్శాఖ..
ఇటీవల మైన్స్ కార్యాలయంలో అవినీతి కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తుండటతో మైన్స్ అధికారులు, ఉద్యోగులు హడలిపోతున్నారు. గత మూడు రోజుల క్రితం ఓ గ్రానైట్ రాళ్ళు తరలిస్తున్న లారీకి సీనరేజి వసూలు విషయంలో నెలకొన్ని విభేధాల కారణంగా ఓ వ్యాపారి నేరుగా ఒంగోలు మైన్స్ కార్యాలయానికి వచ్చి ఏడి రాజశేఖర్తో వాగ్వివాదానికి దిగాడు… తాను సీనరేజి కట్టినా ఎందుకు తిరిగి ఫైన్ వేశారంటూ నిలదీశాడు. దీంతో మైనింగ్ అధికారులు ఒకవైపు అవినీతికి పాల్పడుతూనే మరోవైపు అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు అప్పుడప్పుడు దాడుల పేరుతో ఫైన్లు వేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
అలాగే మైనింగ్ అధికారులు, రవాణాశాఖ అధికారులు ఓవర్ లోడింగ్తో వెళుతున్న గ్రానైట్ వాహనాలను ఎలాంటి తనిఖీలు చేయకుండా డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు మైన్స్, రెవెన్యూ,రవాణా,పోలీసు అధికారులతో సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలో మైనింగ్శాఖ కార్యాలయంలో ఏసిబి సోదాలు నిర్వహించడంతో ఆ శాఖ ఉద్యోగుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




