AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీకు 27 కోట్లు దండగ.. వాడికి 50 కోట్లు ఇచ్చినా తప్పులేదు.. ఫ్రాంచైజీ పరువు తీస్తున్నావ్‌గా..!

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ ఓవర్‌లో పరాజయం పాలైంది. ఈ ఓటమికి కెప్టెన్ రిషబ్ పంత్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలే కారణమని అభిమానులు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు.

నీకు 27 కోట్లు దండగ.. వాడికి 50 కోట్లు ఇచ్చినా తప్పులేదు.. ఫ్రాంచైజీ పరువు తీస్తున్నావ్‌గా..!
Lsg Rishabh Pnat
Venkata Chari
|

Updated on: May 05, 2026 | 8:32 AM

Share

ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్, తొలుత కేకేఆర్‌ను కట్టడి చేసినప్పటికీ చివరి ఓవర్లలో తడబడ్డాడు. కేకేఆర్ కేవలం 155 పరుగులకే పరిమితం కావాల్సిన చోట, పంత్ తీసుకున్న ఒక నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

బౌలింగ్‌లో తప్పుడు లెక్కలు.. రింకూ సింగ్ విధ్వంసం!

చివరి ఓవర్లో అనుభవం లేని దిగ్విజయ్ రాఠీకి బౌలింగ్ ఇవ్వడం పంత్ చేసిన అతిపెద్ద తప్పిదంగా మారుతోంది. ఈ అవకాశాన్ని వాడుకున్న రింకూ సింగ్ వరుసగా 4 సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీనివల్ల కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఒకవేళ అక్కడ పంత్ సరైన బౌలర్‌ను వాడి ఉంటే కేకేఆర్ మరో 20 పరుగులు తక్కువకే పరిమితమయ్యేది.

టెస్టు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్..

బ్యాటింగ్ లోనూ పంత్ తన మార్కు హిట్టింగ్ ప్రదర్శించలేకపోయాడు. టీ20 మ్యాచ్‌లో టెస్టును తలపించేలా 38 బంతుల్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అంటే పంత్ స్ట్రైక్ రేట్ కేవలం 110.53 మాత్రమే. ఈ మందకొడి బ్యాటింగ్ వల్ల జట్టుపై ఒత్తిడి పెరిగి మ్యాచ్ డ్రా కావడానికి, అటు నుండి సూపర్ ఓవర్‌కు దారితీయడానికి కారణమైంది.

సూపర్ ఓవర్ ఓటమి: పూరన్‌ను ఎందుకు పంపారు?

సూపర్ ఓవర్‌లో లక్నో మరో తప్పిదం చేసింది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ లేక సతమతమవుతున్న నికోలస్ పోరన్‌ను ఓపెనర్‌గా పంపడంపై విమర్శలు వస్తున్నాయి. పంత్ కెప్టెన్సీ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

27 కోట్ల జీతంపై నెటిజన్ల ట్రోల్స్..

ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండటంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. “నీలాంటోడికి 27 కోట్లు ఇచ్చే బదులు, వైభవ్ సూర్యవంశీ వంటి విధ్వంసకర ఆటగాడికి 50 కోట్లు ఇచ్చినా తక్కువే” అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. 27 కోట్ల భారీ ధర తీసుకుంటూ జట్టును చివరి స్థానంలో ఉంచడంపై అభిమానులు మండిపడుతున్నారు.

ప్లేఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయా?

వరుస ఓటములతో లక్నో ప్లేఆఫ్స్ రేసులో చాలా వెనుకబడిపోయింది. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా విఫలమవుతున్న పంత్, రాబోయే మ్యాచ్‌ల్లోనైనా తన తప్పులను సరిదిద్దుకుని జట్టును గెలిపిస్తాడో లేదో చూడాలి. ఏది ఏమైనా, ఈ ఓటమి లక్నో అభిమానుల మనసును తీవ్రంగా గాయపరిచింది.

క్రికెట్ లో నిర్ణయాలు సెకన్ల వ్యవధిలో తీసుకోవాలి, కానీ అవి జట్టు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పంత్ ఈ మ్యాచ్ లో తీసుకున్న నిర్ణయాలు అతడికి పాఠాలు నేర్పుతాయని ఆశిద్దాం. మరి లక్నో తన తదుపరి పోరులో ఎలా పుంజుకుంటుందో వేచి చూడాలి!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us