Renigunta: ప్రైవేటు లాడ్జిలో అనుమానాస్పదంగా ఇద్దరు మహిళలు.. పోలీసులు వెళ్లేసరికి..
అమ్మ బాబోయ్.. మహిళలు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో భాగం అవ్వడం చింతించాల్సిన విషయం. అవును.. రేణుగుంటలోని ప్రైవేట్ లాడ్జిల్లో తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరు మహిళలు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. డీటేల్స్ ఇలా ...

టెంపుల్ సిటీకి గంజాయి చేర్చుతున్న ముఠాలపై తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. గంజాయి స్మగ్లింగ్పై మరింత ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా సమాచారంపై పలు ప్రైవేటు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు లేడీ కిలాడీలను గుర్తించారు.
రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలో రూమ్ నెంబర్ 207 లో ఉన్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి రెండు సూట్ కేసులలో దాచిన 24.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాళ్లు వెస్ట్ బెంగాల్కు చెందిన 31 ఏళ్ల మమోని ముండాల్, 37 ఏళ్ల సమిత ముండాల్గా గుర్తించారు. ఒడిశా నుండి కేరళకు గంజాయి తీసుకెళ్తూ రేణిగుంటలో దిగినట్లు నిర్ధారించారు. అడిషనల్ ఎస్పీ రవి నిందితురాళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఆర్పీఎఫ్ సాయంతో రైళ్లలో గంజాయి తరలింపుపై గట్టి నిఘా పెడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం డాగ్స్కు ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




